హమ్మయ్య.. ఆ భారతీయుల ఆచూకీ లభించింది!

ABN , First Publish Date - 2022-01-27T20:54:42+05:30 IST

టర్కీలో అదృశ్యమైన భారతీయుల ఆచూకీ లభించింది. రెండ్రోజుల్లో ఇండియాకు చేరుకుంటారని గుజరాత్‌ సీనియర్ పోలీసు అధికారులు మీడియాకు వెల్లడించారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూ

హమ్మయ్య.. ఆ భారతీయుల ఆచూకీ లభించింది!

ఎన్నారై డెస్క్: టర్కీలో అదృశ్యమైన భారతీయుల ఆచూకీ లభించింది. రెండ్రోజుల్లో ఇండియాకు చేరుకుంటారని గుజరాత్‌ సీనియర్ పోలీసు అధికారులు మీడియాకు వెల్లడించారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం ఒకే కుటంబానికి చెందిన నలుగురు గుజరాతీయులు కెనడా ద్వారా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ సరిహద్దు వద్ద ప్రాణాలు వదిలారు. ఈ ఘటన భారత్ సహా కెనడా, అమెరికాలో కూడా సంచలనంగా మారింది. ఈ ఘటన మరువక ముందే.. రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు గుజరాతీలు టర్కీ ద్వారా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఇస్తాంబుల్‌లో అదృశ్యమయ్యారంటూ వార్తలొచ్చాయి. విదేశీయులను అక్రమంగా అమెరికాలోకి తరలించే ముఠానే వీళ్లను కిడ్నాప్ చేసి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. 



దీంతో గుజరాత్ పోలీసులు సహా ఇస్తాంబుల్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా స్పందించింది. ఈ క్రమంలోనే గుజరాత్ పోలీస్ ఉన్నతాధికారులు కీలక ప్రకటన చేశారు. ఆరుగురు వ్యక్తుల జాడ దొరికినట్టు వెల్లడించారు. ఇస్తాంబుల్‌లోని ఓ హోటల్‌లో వీళ్ల ఆచూకీ లభించిందని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా మరో రెండు మూడు రోజుల్లో ఈ ఆరుగురు వ్యక్తులు ఇండియాకు చేరుకోనున్నట్టు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఈ ఆరుగురు గుజరాతీలు విజిట్ వీసాపై ఇస్తాంబుల్‌కు వెళ్లినట్టు పేర్కొన్నారు కానీ.. అమెరికాకు వెళ్లేందుకు వాళ్లు ప్రయత్నించారా లేదా అనే విషయంలో మాత్రం అధికారుల క్లారిటీ ఇవ్వలేదు. 




Updated Date - 2022-01-27T20:54:42+05:30 IST