అంతుపట్టని మిస్టరీ

ABN , First Publish Date - 2021-03-03T06:05:51+05:30 IST

ఆ తల్లీ కూతుళ్లకు ఏమైందో తెలియదు..

అంతుపట్టని మిస్టరీ
తల్లీ, కూతురు (ఫైల్‌ ఫోటో)

ఉదయం తల్లి.. సాయంత్రానికి కుమార్తె మృతి

విషాదంలో వీరంపాలెం


పెదవేగి(పశ్చిమ గోదావరి): ఆ తల్లీ కూతుళ్లకు ఏమైందో తెలియదు. తెల్లవారుజామున తల్లి చనిపోతే.. సాయంత్రానికి కుమార్తె కన్ను మూసింది. 12 గంటల వ్యవధిలో ఓ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం వరకు ఎంతో ఆనందంగా వున్న ఆ కుటుంబం నేడు శోక సంద్రంలో మునిగిపోయింది. పెదవేగి మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని వీరంపాలెంకు చెందిన బూబత్తుల వెంకటేశ్వరరావు, రమణ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. గాలాయగూడెంలో జరిగిన శ్రీఅచ్చమ్మ తల్లి ఉత్సవాలకు వెళ్ళి వచ్చారు. రెండు రోజుల తరువాత ఉన్నట్టుండి రమణ అనారోగ్యానికి గురైంది. ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగానే 13 ఏళ్ళ కుమార్తె శ్రావణి తీవ్ర అనారోగ్యానికి గురైంది. వైద్యుల సూచనల మేరకు శ్రావణిని గుంటూరు జనరల్‌ ఆస్పత్రికి తీసుకెళ్ళారు.


ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి రమణ(35) సోమవారం తెల్లవారుజామున కామెర్లు, కిడ్నీ సంబంధ లక్షణాలతో మృతి చెందింది. ఇంతలో కుమార్తె శ్రావణి ఆరోగ్యం మరింత క్షీణించి సాయం త్రానికి మృతి చెందింది. సోమవారం సాయంత్రం తల్లికి.. మంగళవారం కుమార్తెకు అంత్యక్రియలు నిర్వహించారు. శ్రావణి మృతికి కారణాలు ఎవరూ చెప్పలేకపోతున్నారని గ్రామస్తులు తెలిపారు. శ్రావణి పెదవేగి జడ్పీ హైస్కూలో తొమ్మిదో తరగతి చదువుతోంది. 

Updated Date - 2021-03-03T06:05:51+05:30 IST