కూర, కోడిగుడ్డు లేని భోజనం!
ABN , First Publish Date - 2022-01-20T06:16:35+05:30 IST
విద్యార్థులకు కూర, కోడిగుడ్డు లేకుండా మధ్యాహ్న భోజనం పెట్టడంపై ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చారుతో అన్నం తింటున్న విద్యార్థులు
నిర్వాహకురాలిని నిలదీసిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
మద్యం సేవించి పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుడిపై ఆగ్రహం
ఐటీడీఏ పీవోకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరిక
కొయ్యూరు, జనవరి 19: విద్యార్థులకు కూర, కోడిగుడ్డు లేకుండా మధ్యాహ్న భోజనం పెట్టడంపై ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మధ్యాహ్న ఆమె కొయ్యూరు శివారు చింతవానిపాలెం ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో విద్యార్థులు భోజనం చేస్తుండడంతో మెనూ గురించి ఆరా తీశారు. ఎవరి ప్లేట్లో కూడా కూర, కోడిగుడ్డు లేవు. కేవలం చారుతో పిల్లలు భోజనం చేస్తున్నారు. దీంతో మెనూ ప్రకారం భోజనం ఎందుకు పెట్టడంలేదని నిర్వాహకురాలిని నిలదీశారు. ఉపాధ్యాయుడు నేతల అప్పారావు మద్యం సేవించి ఉండడం, ఐదవ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయకుండా బీరువాలో వుంచడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠ్యాంశాలపై విద్యార్థులకు పలు ప్రశ్నలు వేయగా, కనీస సమాధానం చెప్పకపోవడంతో ఉపాధ్యాయుడిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలలో నెలకొన్న పరిస్థితులపై ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు.