కొండా దంపతులనే తరిమికొట్టా.. స్తూపం ఓ లెక్కా!
ABN , First Publish Date - 2022-01-24T05:13:02+05:30 IST
కొండా దంపతులనే తరిమికొట్టా.. స్తూపం ఓ లెక్కా!
నిద్రపోతున్న సింహం కాదు.. లేవలేని స్థితిలో ఉన్నారు..
కొండా దంపతులపై పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శ
నడికూడ, జనవరి 23 : ‘కొండా దంపతులనే తరిమి కొట్టాను.. స్తూపం ఓ లెక్కా..’ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ జాతరలో కొండా సురేఖ తనపై చేసిన వ్యాఖ్యలపై ధర్మారెడ్డి స్పందించారు. సమ్మక్క - సారలమ్మల సన్నిధిలో కొండా మురళి తల్లిదండ్రుల స్తూపం పెట్టినప్పటి నుంచి కొండా దంపతులకు నాశనం కూడిందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అదివారం నడికూడ మండలకేంద్రంలో హనుమాన్ గుడి నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. వేయి తప్పులు చేసి నాశనానికి గురైన కొండా దంపతులు.. ప్రజల చేతిలో ఇంకా నాశనం అవుతారని విమర్శించారు. సమ్మక్క- సారలమ్మ జన్మస్థానమైన ఆత్మకూరు మండలం ఆగ్రంపహాడ్ జాతరలో కొండా మురళి తల్లిదండ్రుల స్మారక స్తూపం పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ‘నేను ఆగ్రహిస్తే స్తూపం అడ్రస్ ఉండదు’ అని మండిపడ్డారు. కొండా దంపతులు నిద్రపోతున్న సింహం కాదు.. లేవలేని స్థితిలో ఉన్నారు.. అని ఎద్దేవా చేశారు. ప్రజలు వారి ముఖం చూడడానికి కూడా ఇష్టపడడంలేదని ఎమ్మెల్యే ధర్మారెడ్డి అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాతనే అభివృద్ధి జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మచ్చ అనసూర్య, జడ్పీటీసీ సుమలత, సర్పంచ్ ఊర రవీందర్రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దురిశెట్టి చంద్రమౌళి, పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బండి సారంగపాణి, రైతు సమితి జిల్లా కోఆర్డినేటర్ బొల్లే భిక్షపతి, కిన్నేర మణి తదితరులు పాల్గొన్నారు.