రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు
ABN , First Publish Date - 2021-12-06T05:59:34+05:30 IST
రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు
సీఎం జగన్మోహన్రెడ్డిపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శలు
పటమట, డిసెంబరు 5: ఒక్క చాన్స్ ఇవ్వండి అంటూ ఓట్లు అడిగి అధికారంలోకి వచ్చాక సీఎం జగన్మోహనరెడ్డి రాష్ర్టాన్ని నాశనం చేస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. రాజకీయాలు, ప్రభుత్వాలు శాశ్వతం కాదని భావితరాల భవిష్యత్తు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఆదివారం 13వ డివిజన్ న్యూ ఆర్టీసీ కాలనీలో ఆయన పర్యటించారు. స్థానికులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రారంభించిన ప్రతి పనినీ జగన్మోహనరెడ్డి నిలిపివేశారని, ప్రజా వేదికను కూల్పివేశారని, అమరావతిని విచ్ఛిన్నం చేశారని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేదని, చంద్రబాబు ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాన్ని రద్దు చేశారని ఆయన విమర్శించారు. జగన్ చేతకాని పాలనతో ఉపాధి కరువై, అన్ని వర్గాల వారు రాష్ట్రం నుంచి వలస వెళ్లిపోతున్నారని, ఆటో కార్మికులకు కిరాయిలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, డివిజన్ అధ్యక్షుడు గద్దె ప్రసాద్, అర్జునరావు, కొడాలి శివప్రసాద్, వెంకట్రావు, కొర్రపాటి శ్రీను, నూతి లక్ష్మీప్రసాద్, శివాజీ, శొంఠి సాయిలక్ష్మి పాల్గొన్నారు.