వానలు కురవాలి.. పంటలు పండాలి

ABN , First Publish Date - 2021-08-02T07:43:07+05:30 IST

‘వానలు కురవాలి. పంటలు బాగా పండాలి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలి’ అని సంగారెడ్డి ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి బోనమెత్తి దుర్గామాతను వేడుకున్నారు.

వానలు కురవాలి.. పంటలు పండాలి

దుర్గామాతను వేడుకున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి

బోనాల ఉత్సవాల్లో స్టెప్పులేసిన ఎమ్మెల్యే

ప్రత్యేక ఆకర్షణగా పోతరాజుల విన్యాసాలు

సంగారెడ్డి టౌన్‌, ఆగస్టు 1: ‘వానలు కురవాలి. పంటలు బాగా పండాలి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలి’ అని సంగారెడ్డి ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి బోనమెత్తి దుర్గామాతను వేడుకున్నారు. సంగారెడ్డిలో ఆదివారం జరిగిన ఆషాడమాస బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యేతో పాటు.. ఆయన సతీమణి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, కూతురు జయారెడ్డి, పీసీసీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ప్రతిఏటా ఆషాడ మాసం చివరి వారంలో దుర్గామాత ఆలయం వద్ద జాతర ఉత్సవాలు వైభవంగా జరుగుతాయన్నారు. నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండేలా దీవించాలని దుర్గామాతను వేడుకున్నానని తెలిపారు.


అంతకుముందు ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో పాతబస్టాండ్‌ సమీపంలోని రామాలయం నుంచి కిందిబజార్‌ తాళ్లపల్లి రోడ్డులోని దుర్గాభవానీ మాత ఆలయం వరకు వందలాది మహిళలు బోనాల ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు. ఈ ఊరేగింపులో పోతరాజుల విన్యాసాలు, కళాకారుల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు, భక్తులు, అభిమానులతో కలిసి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్టెప్పులు వేసి ఉత్సాహం నింపారు. అంతకుముందు రామాలయంలోనూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భార్య నిర్మలారెడ్డి, కూతురు జయారెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి బోనాలతో పాటు తొట్టెల ఊరేగింపుతో శోభాయాత్రగా బయలుదేరి దుర్గామాత ఆలయానికి చేరుకున్నారు. 

Updated Date - 2021-08-02T07:43:07+05:30 IST