10 మందికిపైగా టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధం : గిరి

ABN , First Publish Date - 2020-06-07T01:04:53+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

10 మందికిపైగా టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధం : గిరి

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. టీడీపీకి దూరమైన ఎమ్మెల్యే మద్దాల గిరి ఇవాళ గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ఉన్న 10 మంది పైగా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేందకు సిద్ధంగా ఉన్నారని గిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై సొంత పార్టీ నేతలకు నమ్మకం సన్నగిల్లిపోతుందన్నారు. వైసీపీ ఏడాది పాలన ప్రజలు అందరూ మెచ్చుకుంటున్నారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ప్రంపచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితులను వైసీపీ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటోందని గిరి చెప్పుకొచ్చారు.


గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఏ ప్రభుత్వమూ చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్తోందని గిరి మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. అంతటితో ఆగని ఆయన.. వైసీపీ ఏడాది పాలనపై చంద్రబాబు అనేక ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. 40 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు అబద్దాలు చెప్పడం ఇంకా మానుకోవడం లేదని వ్యాఖ్యానించారు. రాష్టాన్ని అప్పులు ఊబిలో ముంచి వెళ్లిన ఘనత చంద్రబాబుదేనన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గలేదని గిరి చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-06-07T01:04:53+05:30 IST