తమాషాలొద్దు

ABN , First Publish Date - 2021-01-19T08:08:35+05:30 IST

‘‘వైసీపీ నాయకులపై అసభ్య పోస్టింగ్‌ పెడితే..తెలుగుదేశం పార్టీ వాళ్లు చెప్పారని జిల్లా పోలీసు అధికారి ఎవరో కేసు రిజిస్టర్‌ చేయవద్దని చెప్పేది ఏంది? నాకు అర్థం కాలే. ఏమనుకొంటున్నాడాయన... ఎవరనుకొంటున్నాడు...

తమాషాలొద్దు

ఎస్పీకి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి వార్నింగ్‌

నువ్వుండేది నెలో, రెండు నెలలో..

డీజీపీ కాపాడతారనుకొంటున్నావా?..  నాతో పెట్టుకోకు

పోస్టులపై అట్రాసిటీ కేసు

పెట్టవద్దనడానికి నువ్వెవరు?

ఏ ప్రభుత్వం అనుకొంటున్నావ్‌?

ఎవరు నేర్పించారు నీకు రూల్స్‌?

ఉన్నన్ని రోజులైనా శుద్ధంగా ఉండు

ఎవరు కాపాడతారు నిన్ను?

ఇళ్లపట్టాల సభలో ఎస్పీపై 

ఎమ్మెల్యే ప్రసన్న తీవ్ర వ్యాఖ్యలు


‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయవద్దనడానికి నువ్వెవరు!? బాగుండదు. నెల ఉంటావో, రెండు నెలలు ఉంటావో! ఉన్నన్ని రోజులైనా శుద్ధంగా ఉండు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు! ఎవరు నేర్పించారు నీకు రూల్స్‌? ఎవరు కాపాడుతారు నిన్ను.. విజయవాడలో డీజీపీ నిన్ను కాపాడుతారనుకొంటున్నావా?

నెల్లూరు ఎస్పీ భాస్కర్‌భూషణ్‌కు ఎమ్మెల్యే ప్రసన్న వార్నింగ్‌



నెల్లూరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ‘‘వైసీపీ నాయకులపై అసభ్య పోస్టింగ్‌ పెడితే..తెలుగుదేశం పార్టీ వాళ్లు చెప్పారని జిల్లా పోలీసు అధికారి ఎవరో  కేసు రిజిస్టర్‌ చేయవద్దని చెప్పేది ఏంది? నాకు అర్థం కాలే. ఏమనుకొంటున్నాడాయన... ఎవరనుకొంటున్నాడు....ఎవరి గవర్నమెంట్‌ అనుకొంటున్నాడు. బాగుండదు.. పద్ధతి కాదు...తమాషాలు పడొద్దు’’ అంటూ నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌పై కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘నెల ఉంటావో, రెండు నెలలు ఉంటావో.. ఉన్నన్ని రోజులైనా శుద్ధంగా ఉండు’ అని వార్నింగ్‌ ఇచ్చారు. ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం నెల్లూరు జిల్లా కొడవలూరులో జరిగిన సభలో ఎస్పీపై ప్రసన్న ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకుపోతానని కూడా హెచ్చరించారు.


కొద్దిరోజులక్రితం టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేశ్‌లపై కోవూరు నియోజకవర్గం కొడవలూరుకు చెందిన వైసీపీ నాయకుడు అసభ్యకరంగా పోస్టింగులు పెట్టారు. దీన్ని సహించలేక ఒక టీడీపీ నాయకుడు పోస్టింగ్‌ పెట్టిన వైసీపీ వ్యక్తిపై అసభ్యకర పదజాలంతో తిరిగి పోస్టింగ్‌ చేశారు. దీనిపై వైసీపీ నాయకులు కొడవలూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు 292 కింద కేసు నమోదు చేశారు. అయితే పోస్టింగ్‌ పెట్టిన టీడీపీ నాయకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వైసీపీ నాయకులు పట్టుబట్టారు. దీనికి ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ అంగీకరించలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ఏర్పాటుచేసిన సభలో కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి.. ఎస్పీపై విరుచుకుపడ్డారు.


‘‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయండి. డీఎస్పీ వచ్చి విచారిస్తారు. తప్పుడు కేసు అయితే తీసేస్తారు. నిజమని తేలితే లోపలేస్తారు. అంతేకదా!? కేసు రిజిస్టర్‌ చేయవద్దనడానికి నువ్వెవరు!? బాగుండదు. ఉన్నన్ని రోజులైనా శుద్ధంగా ఉండు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు! ఎవరు నేర్పించారు నీకు రూల్స్‌! ఎవరు కాపాడుతారు నిన్ను! విజయవాడలో డీజీపీ నిన్ను కాపాడుతారనుకొంటున్నావా? బాగుండదు. నువ్వు తెలుగుదేశం ఏజెంటువా.. మా జిల్లా పోలీసు అధికారివా? ఎవడో టీడీపీకి చెందిన మాజీ మంత్రి ఫోన్‌ చేసి చెబితే కేసు రిజిస్టర్‌ చేయవద్దనడానికి నువ్వు ఎవరు? ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదు. పైగా కేసు కడితే జైల్లో వేయిస్తానని కింది సిబ్బందిని బెదిరిస్తావా? నీకుందా ఆ దమ్ము! మా ఎస్‌ఐ, సీఐల పక్కన నేను నిలబడతాను. రా! దమ్ముంటే అరెస్ట్‌ చేయించు... ఏమనుకొంటున్నావు. ఎవరి గవర్నమెంట్‌ అనుకొంటున్నావు.. నాతో పెట్టుకోవద్దు’’ అని గద్దించారు. దళిత ఎమ్మెల్యేల మీద అసభ్యంగా పోస్టింగులు పెడుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 


ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌పై ఎమ్మెల్యే ప్రసన్న విరుచుకుపడటం ఇది రెండవ సారి. లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడేలా కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే సహా పలువురిపై ఆయన కేసు నమోదు చేశారు. దీనిపై ప్రసన్న బుచ్చిరెడ్డిపాళెం పోలీసు స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.  ఎస్పీపై ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-01-19T08:08:35+05:30 IST