మోదకొండమ్మ అమ్మవారి పాదాలు ధ్వంసం
ABN , First Publish Date - 2021-06-21T05:35:29+05:30 IST
మోదకొండమ్మ వారి పాదాలను ఇద్దరు యువకులు ధ్వంసం చేయడంతో మండలంలోని ఐతంపూడి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఐతంపూడిలో ఇద్దరు యువకుల దుశ్చర్య
పట్టుకుని నిలదీసిన గ్రామస్థులు
పోలీసులకు ఫిర్యాదు... కేసు నమోదు
బుచ్చెయ్యపేట(విశాఖ జిల్లా), జూన్ 20: మోదకొండమ్మ వారి పాదాలను ఇద్దరు యువకులు ధ్వంసం చేయడంతో మండలంలోని ఐతంపూడి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్థులు వీరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు అందించిన వివరాల మేరకు...
ఐతంపూడి గ్రామానికి చెందిన బండి సతీశ్, మాడుగులకు చెందిన శివ ఆదివారం మధ్యాహ్నం బైక్పై మోదకొండమ్మ అమ్మవారి పాదాలు వున్న మందిరం వద్దకు వచ్చి అమ్మవారి పాదాలను ధ్వంసం చేశారు. ఇది గమనించిన స్థానికులు వారిని పట్టుకుని నిలదీశారు. దీంతో యువకులు గ్రామస్థులతో వాగ్వాదానికి దిగారు. సర్పంచ్ పెద్దాడ నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చోడవరం సీఐ ఇలియాస్ మహ్మద్, ఎస్ఐ బి.రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అమ్మవారి పాదాలను పరిశీలించారు. స్థానికులను విచారించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. సతీశ్ అమ్మవారి పాదల వద్ద వున్న సామగ్రిని ధ్వంసం చేశాడని, అప్పుడు మందలించి వదిలేశామని స్థానికులు తెలిపారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.