నిరాడంబరంగా ఉగాది వేడుకలు
ABN , First Publish Date - 2021-04-14T06:11:41+05:30 IST
తెలుగు సంవత్సరాది పండుగ ఉగాదిపై కరోనా ప్రభావం వరుసగా రెండో ఏడాదీ పడింది. గత సంవత్సరం లాక్డౌన్తో ఉగాది ఉత్సవాలను మొత్తానికి నిర్వహించలేదు. ఈ సారి కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభించడంతో ఉగాదిని నిరాడంబరంగా నిర్వహించారు.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
తెలుగు సంవత్సరాది పండుగ ఉగాదిపై కరోనా ప్రభావం వరుసగా రెండో ఏడాదీ పడింది. గత సంవత్సరం లాక్డౌన్తో ఉగాది ఉత్సవాలను మొత్తానికి నిర్వహించలేదు. ఈ సారి కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభించడంతో ఉగాదిని నిరాడంబరంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఇళ్లలోనే పండుగను జరుపుకున్నారు. శార్వరి నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ వైరస్ కష్టాలు తొలగిపోవాలని ప్లవ నామ సంవత్సరానికి స్వాగతం పలికారు. ఏటా ఉగాది రోజు దేవాలయాలకు వెళ్లి పూజలు చేస్తూ సుఖసంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు సిద్ధింపజేయాలని కోరుకునే వారు. ఈ సారి పెద్దగా సందడి కనిపించలేదు. దేవాలయాల్లో ఉగాది సందర్భంగా అర్చకులే పంచాగాలతో ప్రత్యేక పూజలు చేశారు. కొద్దిమందితో పంచాగ శ్రవణ కార్యక్రమాలు నిర్వహించారు.
మార్కెట్లో కొనుగోళ్ల సందడి
ఉగాది పర్వదినంగా ఇంట్లోనే జరుపుకున్నప్పటికీ పండుగ కావాల్సిన వస్తువుల కోసం ప్రజలు మార్కెట్లోకి రావడంతో సందడి నెలకొంది. ఉదయం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మార్కెట్లో కూరగాయలు, ఉగాది పండుగకు కావాల్సిన పచ్చడి కుండ, వస్తువుల కొనుగోలులో కోసం జనం బిజీగా కనిపించారు. పోలీసులు జనాన్ని క్రమ పద్ధతిలో కొనుగోలు జరుపుకునే విధంగా చర్యలు చేపట్టారు. మాస్క్లు లేనివారికి జరిమానా విధించారు.
రాజన్న క్షేత్రంలో..
వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో శ్రీప్లవ నామ ఉగాది పర్వదిన వేడుకలు మంగళవారం నిరాడంబరంగా జరిగాయి. కరోనా నిబంధనల నేపథ్యంలో అర్చకులు ముం దుగా లక్ష్మీగణపతి, రాజరాజేశ్వరస్వామి వారికి, రాజరాజేశ్వరీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీతా రామచంద్రస్వామివారలకు పంచోపనిషత్ ద్వారాభిషేకం, లక్ష్మీఅనంత పద్మనాభస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి అద్దాల మండపంలో అర్చకుల సమక్షంలో ఆలయ ప్రధాన అర్చకుడు నమిలికొండ ఉమేశ్ శర్మ ప్లవ నామ సంవత్సర పంచాంగ శ్రవణం నిర్వహించారు.
శ్రీరామనవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో శ్రీరామనవరాత్రి ఉత్సవాలు ప్రారంభమ య్యాయి. ఈ సందర్భంగా సీతారామ చంద్రస్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం లక్ష్మీఅనంతపద్మనాభస్వామి, పార్వతీ రాజరాజేశ్వరస్వామివారల ఉత్సవ విగ్రహాలను ఆలయ ఆవరణలో గజ వాహనంపై ఊరేగించారు. శ్రీరామనవమి సంద ర్భంగా ఏప్రిల్ 21వ తేదీన సీతారామ చంద్రస్వామివారి కల్యాణం ఆలయం లోపల నిరాడంబరంగా నిర్వహి స్తామని, తొమ్మిది రోజులపాటు ఉదయం, సాయం త్రం స్వామివారికి ప్రత్యేక పూజలు కొనసా గుతాయని అధికారులు తెలిపారు.