మోదీ, అమిత్షాల లోగుట్టు బయటపెడతా
ABN , First Publish Date - 2021-04-16T07:13:17+05:30 IST
మోదీ, అమిత్షాల లోగుట్టును త్వరలోనే బయటపెడతానని కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్ పేర్కొన్నారు.
తిరుపతి ఎంపీ స్థానం కాంగ్రెస్దే
కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
తిరుపతి(తిలక్రోడ్డు), ఏప్రిల్ 15: మోదీ, అమిత్షాల లోగుట్టును త్వరలోనే బయటపెడతానని కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్ పేర్కొన్నారు. గురువారం తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ.. మోదీ, షాలను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లో వస్తాయన్నారు. ప్రధాని గడ్డం పెంచుకుని సాధువుగా కనిపిస్తున్నాడే తప్ప.. కఠిన వ్యక్తిత్వం కల్గిన అవినీతిపరుడని ఆరోపించారు. దేశాన్ని బీజేపీ, రాష్ర్టాన్ని వైసీపీ భ్రష్టు పట్టిస్తున్నాయని విమర్శించారు. సీఎం జగన్ రాజకీయాల్లో కొనసాగడానికి అనర్హుడని, ఆయన తండ్రి హయాం నుంచే దోచుకోవడం, దాచుకోవడం నేర్చుకున్నారన్నారు. తిరుపతి ఎంపీ స్థానం కాంగ్రెస్దేనని, లక్ష ఓట్లతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి వైసీపీవారు డబ్బు, మద్యం పంచాలనుకున్నా, దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నించినా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే బయటప్రాంతాల నుంచి జనాలను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించడానికి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ప్రమీలమ్మ, రాంభూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.