House strategyపై మంత్రులతో చర్చించిన మోదీ

ABN , First Publish Date - 2021-12-10T22:42:50+05:30 IST

పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నందున ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై..

House strategyపై మంత్రులతో చర్చించిన మోదీ

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నందున ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీనియర్ మంత్రులతో ప్రధాని మోదీ శుక్రవారం సమావేశం జరిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మంత్రి పీయూష్ గోయల్ తదితరులు హాజరయ్యారు.


రాజ్యసభ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం ఉభయసభలను కుదిపేస్తోంది. ఎంపీల సస్పెన్షన్ రద్దు చేయాలంటూ విపక్షాలు సాగిస్తున్న ఆందోళనతో ఉభయసభలూ వాయిదా పడుతూ వస్తున్నాయి. గత ఆగస్టులో వర్షాకాల సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించారంటూ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. సస్పెండైన ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన ఆరుగులు, తృణమూల్ కాంగ్రెస్, శివసేన నుంచి చెరో ఇద్దరు, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. శీతాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచే ఎంపీలు తమ సస్పెన్షన్‌కు నిరసగా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ఆందోళన సాగిస్తున్నారు. దీనికి విపక్ష ఎంపీలు మద్దతుగా నిలుస్తున్నారు. విమాన ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్, మరో 12 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంతాప సూచకంగా సస్పెండ్ ఎమ్మెల్యేలు బైఠాయింపు ధర్నాను గురువారంనాడు నిర్వహించలేదు. రావత్, ఇతరుల మృతికి సంతాప సూచకంగా ఉభయసభల్లోనూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

Updated Date - 2021-12-10T22:42:50+05:30 IST