కోహ్లీకి ప్రధాని మోదీ ఆసక్తికర ప్రశ్న

ABN , First Publish Date - 2020-09-24T19:50:56+05:30 IST

‘ఫిట్‌నెస్’ కు ఐకాన్స్ గా భావించే కొందరు ప్రముఖులతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కోహ్లీకి ప్రధాని మోదీ ఆసక్తికర ప్రశ్న

న్యూఢిల్లీ :  ‘ఫిట్‌నెస్’ కు ఐకాన్స్ గా భావించే కొందరు ప్రముఖులతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘ఫిట్ ఇండియా మూమెంట్’ లో భాగంగా మిలింద్ సోమన్, విరాట్ కోహ్లీతో పాటు మరి కొందరితో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ...


‘‘ఆరోగ్యకరమైన ఆహారం మన జీవన విధానంలో భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నా. ఫిట్ గా మారడం చాలా మంది కష్టమనుకుంటారు. కొద్దిగా క్రమశిక్షణతో సాధన చేస్తే తేలికే. ఫిట్ గా ఉంటూ ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలి. ‘‘ఫిట్‌నెస్ కా డోస్.. ఆధాగంటా రోజ్’’ అని మోదీ పేర్కొన్నారు.

కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆసక్తికర ప్రశ్న వేసిన మోదీ

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా ప్రధాని మోదీ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో కూడా సంభాషించారు. ఈ సందర్భంగా మోదీ ఓ ఆసక్తికర ప్రశ్న వేశారు. ‘‘భారత కెప్టెన్ హోదాలో ఉన్న మీకు కూడా ‘‘యో-యో పరీక్ష (ఆటగాళ్ల ఓర్పు స్థాయిని కొలిచే పరీక్ష) నిర్వహిస్తారా?’’ అని మోదీ ప్రశ్నించారు. దీనికి విరాట్ కోహ్లీ సమాధానమిస్తూ...


‘‘సార్... యో-యో పరీక్ష చాలా ముఖ్యమైంది. ఫిట్ నెస్ దృష్టితో చూస్తే చాలా ముఖ్యమైంది. ప్రపంచ స్థాయి పరంగా చూస్తే మా జట్టు స్థాయి ఇప్పటికీ కొంచెం తక్కువే. దానిని అన్ని విధాలా పెంచుకోడానికి ప్రయత్నిస్తున్నాం. ఇది ప్రాథమిక అవసరం. టీ 20, టెస్టు మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. టెస్టు మ్యాచ్ లో ఆడితే.. రోజు మొత్తం ఆడాలి. మళ్లీ రెండో రోజుకు కూడా సిద్ధం కావాలి. అలాంటి సమయాల్లో ఫిట్‌నెస్ ఓ బెంచ్ మార్క్. నేను చొరవ తీసుకొని ఈ యో-యో పరీక్షకు హాజరవుతా. ఈ పరీక్షలో విఫలమైతే... నేను కూడా ఆటలో ఉండను. ఈ వ్యవస్థను అలా కొనసాగించాల్సిందే.’’ అని విరాట్ కోహ్లీ ప్రధాని మోదీకి సమాధానమిచ్చారు.

ఈ సందర్భంగా నటుడు, మోడల్ మిలింద్ సోమన్‌తో మోదీ ఆసక్తికర సంభాషణ నిర్వహించారు. ‘‘మీ వయస్సు గురించి మీరు చెప్పారు కదా.. అది నిజమేనా... ఇంకేమైనా ఉందా’’? అని మోదీ ఆసక్తికరంగా ప్రశ్నించారు. దీనికి మిలింద్ సోమన్ సమాధానమిస్తూ... ‘‘ఇదే విషయం నన్ను చాలా మంది అడుగుతుంటారు. మీ వయస్సు నిజంగా 55 ఏళ్లేనా? ఇంత వయస్సులో కూడా 500 కిలోమీటర్లు ఎలా పరుగెత్తగలరు? అప్పుడు నేను... మా అమ్మ వయస్సు 81 సంవత్సరాలు. ఇప్పటికీ మా అమ్మ పుషప్స్ చేస్తుంది. మా అమ్మే నాకు స్ఫూర్తి. చాలా మందికి కూడా ఆమే స్ఫూర్తి. ఆమె లాగా నా జీవితం కూడా ఉండాలనుకుంటా’’ అని మిలింద్ తెలిపారు.


మన పూర్వజులు ప్రతి రోజూ 50 కిలోమీటర్లు నడిచేవారని, పల్లెల్లో మహిళలు కూడా నీళ్లు తీసుకురావడం కోసం, పనుల కోసం ఇప్పటికీ అంత కష్టపడతారని పేర్కొన్నారు. కానీ నగరాల్లో మాత్రం జీవన శైలి చాలా భిన్నంగా ఉందని, ఎక్కువగా కూర్చొని ఉంటే మన శక్తి, ఫిట్‌నెస్ తగ్గుతుందని ఆయన తెలిపారు. ఫిట్‌నెస్ గా ఉండాలంటే ‘మానసిక బలం’ ఒక్కటి ఉంటే సరిపోతుందని మిలింద్ పేర్కొన్నారు. 


Updated Date - 2020-09-24T19:50:56+05:30 IST