ఆశల పల్లకి నుంచి..అంగవైకల్యం దాకా ప్రవాసీ
ABN , First Publish Date - 2021-01-25T23:03:00+05:30 IST
విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు అతడి కాలికి అయిన గాయం చివరకు కాలును తొలగించే వరకు వెళ్లిం
ఆపన్నహస్తం అందించిన తెలంగాణ ప్రవాసీయులు
ఖతర్ నుంచి స్వదేశానికి చేరుకున్న బాధితుడు
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు అతడి కాలికి అయిన గాయం చివరకు కాలును తొలగించే వరకు వెళ్లింది. వికలాంగుడిగా మారిన అతను ఉద్యోగానికి అనర్హుడని సంస్థ తొలగించింది. మధుమేహాన్ని సాకుగా చూపి బీమా కంపెనీ పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వడానికి నిరాకరించింది. ఈ ఆపత్కాలంలో మేమున్నామంటూ ఆ కార్మికుడిని ఆపద్బాంధవుడిలా ఆదుకున్నారు తోటి తెలంగాణ ప్రవాసీయులు. తలా తోచినంత సాయం చేయడంతో ఎట్టకేలకు స్వదేశంలోని జగిత్యాల జిల్లాకు తిరిగివెళ్లాడు ఆ కార్మికుడు. కోరుట్ల పట్టణానికి చెందిన మొహమ్మద్ యూనుస్ (54) ఖతర్లోని ఓ సంస్థలో డ్రైవర్గా పనిచేస్తుండగా కొద్ది నెలల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో కుడి కాలికి గాయమైంది. గాయానికి తోడు మధుమేహం ఉండడంతో అనివార్య పరిస్థితుల్లో ఆయన కాలిని తొలగించాల్సి వచ్చింది. నెలన్నర రోజులు ఆస్పత్రిలో ఉన్న యూనుస్ శస్త్రచికిత్స నుంచి కోలుకోవడానికి మరో ఆరు నెలలు ఇంట్లో గడిపాడు.
ఈ కాలానికి సంస్థ ఆయనకు వేతనమేమీ చెల్లించలేదు. పైగా ఉద్యోగం చేయడానికి ఆయన అనర్హుడంటూ తొలగించింది. అనంతరం పరిస్థితి కుదుటపడిన తర్వాత కృత్రిమ కాలు అమర్చారు. ఖతర్బీమా సంస్థ యూనుస్ అంగవైకల్యానికి లక్ష రియాళ్లు (సుమారు రూ.20 లక్షలు) ఇవ్వాల్సి ఉండగా.. మధుమేహంతో కాలు తొలగించాల్సి వచ్చిందన్న వైద్యుల నివేదిక ఆధారంగా పాక్షికంగా పరిహారం చెల్లించింది. ఆయన దీన స్థితి గురించి తెలుసుకున్న ఖతర్లోని తెలంగాణ ప్రజా సమితి, తదితర సంక్షేమ సంఘాలు తిరుపతి చినవేని, ఖాజా నిజామొద్దీన్ల ఆధ్వర్యంలో రూ.3.5 లక్షలు సేకరించి యూన్సకు అందించాయి. దీంతో ఆయన ఖతర్ నుంచి బయల్దేరి స్వదేశానికి చేరుకున్నారు.