అమెరికాకు మరిన్ని ఎయిర్ ఇండియా సర్వీసులు
ABN , First Publish Date - 2021-07-31T11:42:45+05:30 IST
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లనున్న విద్యార్థులకు శుభవార్త. త్వరలోనే ఎయిర్ ఇండియా నుంచి మరిన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి రాబోతున్నాయి. విద్యార్థుల నుంచి ఏర్పడుతున్న డిమాండ్
ఆగస్టు 7 నుంచి రెట్టింపు!
న్యూఢిల్లీ, జూలై 30: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లనున్న విద్యార్థులకు శుభవార్త. త్వరలోనే ఎయిర్ ఇండియా నుంచి మరిన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి రాబోతున్నాయి. విద్యార్థుల నుంచి ఏర్పడుతున్న డిమాండ్ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఆగస్టు మొదటి వారం నుంచి అమెరికాకు విమాన సర్వీసులను పెంచబోతోంది. జూలైలో అమెరికాకు వారానికి పదకొండు విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా నడపగలిగింది. అయితే ఆగస్టు 7 నుంచి వీటిని 22కు పెంచబోతున్నట్టు ఓ టీవీ చానల్కు సంస్థ తెలియజేసింది. మరోవైపు ఆగస్టు 6, 13, 20, 27న న్యూఢిల్లీ, నేవార్క్ మధ్య అదనంగా ఎయిర్ ఇండియా విమానాలు నడపనుంది.
ఈ మేరకు సంస్థ ట్వీట్ చేసింది. ఈ సెక్టార్లో నడుపుతున్న విమాన సర్వీసులకు ఇవి అదనమని పేర్కొంది. మరోవైపు కొవిడ్ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసుల రద్దును ఆగస్టు 31 వరకు పొడిగించినట్టు శుక్రవారం డీజీసీఏ వెల్లడించింది. అయితే ప్రత్యేకంగా అనుమతించిన విమానాలు, అంతర్జాతీయ కార్గో కార్యకలాపాలకు రద్దు వర్తించదని డీజీసీఏ సర్క్యులర్ పేర్కొంది. కరోనా నేపథ్యంలో గతేడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. వందే భారత్ మిషన్లో భాగంగానేకాకుండా ఎయిర్ బబుల్ ఒప్పందాలతో ఎంపిక చేసిన దేశాలకు ప్రత్యేక అంతర్జాతీయ విమాన సర్వీసులనే నడిపిస్తున్నారు.