ఒమైక్రాన్ బాధితుల్లో యువతే ఎక్కువ
ABN , First Publish Date - 2021-12-03T08:02:38+05:30 IST
ఒమైక్రాన్ వేరియంట్ వల్ల కలిగే పరిణామాలను ఇప్పుడే ఊహిం చడం కష్టమని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఇప్పుడది వయోధికులకూ సోకుతోంది.. దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తల వెల్లడి
ప్రెటోరియా, డిసెంబరు 2: ఒమైక్రాన్ వేరియంట్ వల్ల కలిగే పరిణామాలను ఇప్పుడే ఊహిం చడం కష్టమని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పటి వరకు ఇది యువతకు ఎక్కువగా సోకిందని, వైరస్ బారిన పడిన కొద్దికాలం తర్వాత వారు అస్వస్థతకు గురవుతున్నారని వెల్లడించారు. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న ఈ వేరియంట్ స్వల్ప అనారోగ్యాన్ని కలిగి స్తుందని తెలిపారు. బుధవారం ప్రజాప్రతినిధులకు ఇచ్చిన ప్రజెంటేషన్లో శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో దక్షిణాఫ్రికాలో దాదాపు రెట్టింపు కేసులు(8,561) నమోదయ్యాయని జాతీయ అంటు వ్యాధుల నివారణ సంస్థ(ఎన్ఐసీడీ) పేర్కొంది. ప్రస్తుతం ఒమైక్రాన్ వేరియంట్ దేశంలో ప్రబలంగా ఉందని తెలిపింది. ఒమైక్రాన్ ఇన్ఫెక్షన్లు యువతలో ఎక్కువగా గుర్తించినా, ప్రస్తుతం అవి వయోధికుల్లోనూ కనిపించడం ప్రారంభమైందని తెలిపింది. చాలా మంది ఇప్పటికే ఇతర వేరియంట్ల బారిన పడ్డారని, ఎంతో మంది టీకా తీసుకున్నారని.. ఈ నేపథ్యంలో ఒమైక్రాన్ వల్ల కలిగే వ్యాధి తీవ్రత అంతగా ఉండకపోవచ్చని అంటు వ్యాధుల నిపుణుడు ఒకరు వెల్లడించారు.