రూ. 100 నోటుకే గిరాకీ.. రూ. 2 వేల నోటును పట్టించుకోని జనం

ABN , First Publish Date - 2022-05-28T22:19:49+05:30 IST

నోట్ల రద్దు తర్వాత దేశంలో నగదు రహిత లావాదేవీలు పెరిగాయి. ఆ తర్వాత నెమ్మదిగా మునుపటి పరిస్థితులు రావడంతో

రూ. 100 నోటుకే గిరాకీ.. రూ. 2 వేల నోటును పట్టించుకోని జనం

హైదరాబాద్: నోట్ల రద్దు తర్వాత దేశంలో నగదు రహిత లావాదేవీలు పెరిగాయి. ఆ తర్వాత నెమ్మదిగా మునుపటి పరిస్థితులు రావడంతో ప్రస్తుతం నగదు లావాదేవీలు కూడా మామూలుగానే జరుగుతున్నాయి. నోట్ల రద్దు తర్వాత అప్పటి వరకు ఉన్న వెయ్యి రూపాయల నోటు స్థానంలో కొత్తగా రూ. 2 వేల నోటు చలామణిలోకి వచ్చింది. ప్రస్తుతం నగదు లావాదేవీలు విరివిగానే జరుగుతున్నప్పటికీ రూ. 2 వేల నోటు గురించి జనం పెద్దగా పట్టించుకోవడం లేదంటూ భారతీయ రిజర్వు బ్యాంకు ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించింది. శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ఆర్బీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. నగదు లావాదేవీల సమయంలో జనం ఎక్కువగా రూ. 100 నోటకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు పేర్కొంది. రూ. 2 వేల నోటును ప్రజలు అసలు పట్టించుకోవడం లేదని, రూ. 500 నోటు మాత్రం చలామణిలో ఎక్కువగా వినియోగిస్తున్నట్టు వివరించింది.


28 రాష్ట్రాలు, మూడు కేంద్రత పాలిత ప్రాంతాల్లోని గ్రామాలు, పాక్షిక పట్టణాలు, పట్టణాలు, మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో నిర్వహించిన సర్వే అనంతరం ఆర్బీఐ ఈ నివేదికను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 3 శాతం మంది ప్రజలు బ్యాంకు నోట్లపై ఉండే మహాత్మాగాంధీ వాటర్ మార్క్ బొమ్మ, సెక్యూరిటీ థ్రెడ్‌ వంటి భద్రతా ఫీచర్లను గుర్తించలేకపోయారు. ఇక, నాణేల విషయానికి వస్తే 5 రూపాయల నాణేనికి ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుండగా, రూపాయి నాణేనికి చివరి ప్రాధాన్యం లభిస్తున్నట్టు ఆర్బీఐ నివేదిక పేర్కొంది.

Updated Date - 2022-05-28T22:19:49+05:30 IST