ఈటలను ఎన్నికల నుంచి బహిష్కరించాలి: మోత్కుపల్లి
ABN , First Publish Date - 2021-07-29T18:31:53+05:30 IST
హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని మోత్కుపల్లి పిలుపు ఇచ్చారు.
హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు దళితులకు పిలుపు ఇచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత బంధును అడ్డుకునేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. దళితులు బాగుపడితే బానిసలుగా ఉండరని భావిస్తున్నారని, అఖిలపక్షం దళిత బంధును స్వాగతించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ అవినీతిపరుడని, పదవిని అడ్డం పెట్టుకుని 700 ఎకరాల భూమి సంపాదించారని ఆరోపించారు. 40 ఎకరాలు దళితుల అసైన్డ్ భూమని ఆయనే చెప్పారని, ఆ భూమిని వెంటనే వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈటలను ఎన్నికల నుంచి బహిష్కరించాలని హుజూరాబాద్ ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఉప ఎన్నికలో ఆయనను ఓడించాలన్నారు.