కూతురును చంపి తల్లి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-04-24T17:36:37+05:30 IST
ఓ గృహిణి కూతురి జీవితాన్ని చిదిమేసి తనకు తాను ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్/అల్వాల్ : ఓ గృహిణి కూతురి జీవితాన్ని చిదిమేసి తనకు తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఒడిశా రాష్ట్రం, మయూర్ బంజ్ జిల్లా బరిపడ గ్రామానికి చెందిన సుదేందుగిరి అదే గ్రామానికి చెందిన బిష్ణుప్రియ (30)ను 8 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి మూడున్నర ఏళ్ల కూతురు ఉంది. సుదేందుగిరికి సిద్దిపేట్లోని బయోటెక్ కంపెనీలో ఉద్యోగం రావడంతో నాలుగు సంవత్సరాల క్రితం భార్య, కుమార్తెతో కలిసి అల్వాల్ల్లోని భారతీనగర్లో ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. పెళ్లి నాటి నుంచి కూడా బిష్ణుప్రియ ఎవరితోనూ సక్రమంగా మాట్లాడేది కాదు. ఓంటరిగా ఉండటానికే ఇష్టపడేది. కూతురునీ బయటకు రాకుండా ఇంట్లోనే ఉంచేది. దీంతో భర్త సుదేందుగిరి కొన్ని నెలల నుంచి మానసిక నిపుణులను కలిసి భార్యకు చికిత్స అందిస్తున్నాడు.
ఈ క్రమంలో సుదూందుగిరి గురువారం రాత్రి 8-30 గంటలకు ఉద్యోగం నుంచి వచ్చేసరికి ఇంటి లోపల నుంచి తాళంవేసి ఉంది. ఎంత సేపటికి తలుపులు తీయలేదు. స్ధానికుల సహాయంతో తలుపులు తెరిచి చూసే సరికి భార్య కూతురు ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించారు. మొదట కుమార్తెకు చున్నీతో ఉరి వేసిన అనంతరం బిష్ణుప్రిమ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఒంటరి జీవితానికి అలవాటు పడి మానసిక రుగ్మతలతో భాధపడుతున్న కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.