చిరుతతో పోరాడిన మహిళ.. కొడుకును కాపాడేందుకు ఆ తల్లి ఎంత పోరాటం చేసిందంటే..

ABN , First Publish Date - 2021-11-30T17:40:53+05:30 IST

ఒక మహిళ తన బిడ్డను కాపాడుకునేందుకు ప్రాణాలను పణంగా పెట్టింది. ఏకంగా చిరుతపులితో పోరాడింది.

చిరుతతో పోరాడిన మహిళ.. కొడుకును కాపాడేందుకు ఆ తల్లి ఎంత పోరాటం చేసిందంటే..

ఒక మహిళ తన బిడ్డను కాపాడుకునేందుకు ప్రాణాలను పణంగా పెట్టింది. ఏకంగా చిరుతపులితో పోరాడింది. దాదాపు కిలోమీటరు దూరం అడవిలో చిరుతపులితో పాటు పరిగెత్తి తన కొడుకును కాపాడుకుంది. ఆ క్రమంలో ఆమె తీవ్ర గాయాలపాలైంది. అయినా కొడుకును కాపాడుకున్నాననే సంతోషం ముందు ఆ గాయాలు ఆమెను పెద్దగా బాధించలేదు. ప్రస్తుతం తల్లీ, కొడుకు ఆస్పత్రిలో చికిత్స అందుకుంటున్నారు. 


మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో ఉన్న బిజారియా గ్రామం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌కు సమీపంలో ఉంది. అప్పుడప్పుడు ఆ గ్రామం మీద పులులు దాడి చేస్తుంటాయి. ఆ గ్రామానికి చెందిన కిరణ్ బైజా అనే మహిళ సోమవారం ఉదయం ఇంటి బయట వంట చేస్తోంది. తన ఎనిమిదేళ్ల కొడుకు రాహుల్ అక్కడే ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో ఓ చిరుతపులి అక్కడకు వచ్చి రాహుల్‌ను నోట కరుచుకుని పరిగెత్తింది. ఆ దృశ్యాన్ని చూసిన కిరణ్ కూడా చిరుతపులి వెంట పెద్ద కర్ర పట్టుకుని పరిగెత్తింది.


అడవిలో చిరుత పులిని దాదాపు కిలోమీటరు దూరం తరిమింది. దీంతో బాలుడిని వదిలేసిన చిరుతపులి కిరణ్‌పై దాడి చేసింది. కర్రతోనే కిరణ్ ఆత్మరక్షణ కోసం ప్రయత్నించింది. ఆ క్రమంలో ఆమె తీవ్రంగా గాయపడింది. చిరుత మరోసారి దాడి చేసే సమయానికి గ్రామస్థులు పెద్దగా అరుచుకుంటూ అక్కడికి వచ్చారు. దీంతో చిరుత అడవిలోకి పారిపోయింది. గాయపడిన కిరణ్‌ను, ఆమె బిడ్డను గ్రామస్థులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ కోలుకుంటున్నారు.  

Updated Date - 2021-11-30T17:40:53+05:30 IST