హామీలన్నీ నెరవేర్చడమే మా లక్ష్యం : ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2020-10-28T19:15:51+05:30 IST

మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలన్నింటినీ నెరవేర్చడమే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గత ప్రభుత్వాల చూపు ఎప్పుడూ కమిషన్ల

హామీలన్నీ నెరవేర్చడమే మా లక్ష్యం : ప్రధాని మోదీ

పాట్నా : మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలన్నింటినీ నెరవేర్చడమే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గత ప్రభుత్వాల చూపు ఎప్పుడూ కమిషన్ల మీద మాత్రమే ఉండేదని, ప్రజల అవసరాలపై ఉండేది కాదని విమర్శించారు. దర్భంగలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. ‘‘కొన్ని రోజుల క్రిందటే మహాసేతును ఆవిష్కరించాం. దీని ద్వారా రైతులు, వ్యాపారులతో పాటు విద్యార్థుల ప్రయాణాల సమయం తగ్గుతుందన్నారు. అంతేకాకుండా ఉపాధి దొరకడానికి కూడా అవకాశం ఉందన్నారు. ఓటు వేసే సందర్భంగా ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రామ మందిర నిర్మాణం జరుగుతున్న సందర్భంగా ఆయన బిహార్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.


‘‘సీతామాత భూమిలో నివసిస్తున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను నెరవేర్చడమే మా లక్ష్యం.’’ అని మోదీ ప్రకటించారు. తమ దృష్టి అంతా ‘ఆత్మనిర్భర బిహార్’ వైపే కేంద్రీకృతమైందని, ప్రతిపక్షాల కళ్లు మాత్రం ప్రాజెక్టులకు చెందిన డబ్బులపైనే ఉన్నాయని విమర్శించారు.  బిహార్‌ను ఎన్డీయే మాత్రమే కాపాడగలుగుతుందని, అందుకే ప్రజలందరూ ఎన్డీయే కూటమిని ఆదరించాలని పిలుపునిచ్చారు. బిహార్‌ను ‘జంగల్ రాజ్’ గా మార్చిన వారిని, దోచుకున్న వారికి ఓటు వేయమని నిర్ణయించుకున్నారని మోదీ పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-28T19:15:51+05:30 IST