ఆరెస్ట్లతో ఉద్యమాలను అపలేరు
ABN , First Publish Date - 2020-06-03T10:00:29+05:30 IST
పోతిరెడ్డి, తుమ్మిళ్ల, నెట్టంపాడు ప్రాజెక్టుల సమస్యలపై దీక్షలకు పూనుకుంటే దౌర్జన్యంగా ఆరెస్ట్ చేయటం తగదని
మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్
గద్వాల క్రైం, వడ్డేపల్లి, అయిజ, రాజోళి, జూన్ 2 : పోతిరెడ్డి, తుమ్మిళ్ల, నెట్టంపాడు ప్రాజెక్టుల సమస్యలపై దీక్షలకు పూనుకుంటే దౌర్జన్యంగా ఆరెస్ట్ చేయటం తగదని ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ అన్నారు. మునిసిపాలిటీ కేంద్రమైన శాంతినగర్లో ఉన్న సంపత్కుమార్ ఇంటికి ఉదయం ఆరు గంటల సమయంలో సీఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది చేరుకున్నారు. దీక్ష చేపట్టేందుకు వెళ్లనీయకుండా గృహనిర్బంధంలోనే ఉంచారు. 9.30 గంటల తరవాత సంపత్కుమార్తో పాటు కొందరు నాయకులను శాంతినగర్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఆ సమయంలో ఆయన ఒంటిపై టవల్, లుంగీ మాత్రమే ఉన్నాయి. అక్కడి నుంచి మల్దకల్ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ తనను దుస్తులు కూడా వేసుకోనీయకుండా అర్ధనగ్నంగా స్టేషన్కు తర లించడం తగదన్నారు.
తుమ్మిళ్ల రెండో విడత పనులు, పోతిరెడ్డిపాడుకు నీటి తరలింపుపై ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు. అయిజలో కాంగ్రెస్ నాయకులు షెక్షావలి ఆచారి, దేవరాజు, సాంబశివుడు, హనుమన్న, మద్దిలేటి, ఫిరోజ్లను అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. రాజోళిలో కాంగ్రెస్ అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, మైనార్టీ అధ్యక్షుడు శాలు, హుసేన్, మాజీ సర్పంచు దస్తగిరిలను పోలీసులు అరెస్టు చేశారు. గద్వాలలో కాంగ్రెస్ నాయకులు పటేల్ ప్రభాకర్రెడ్డి, శంకర్, ఇసాక్, ఉమాదేవి తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి సొంత పూచీకత్తుపై వదిలేశారు.