‘ఆచార్య’ వచ్చారు!

ABN , First Publish Date - 2021-03-08T06:00:35+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ‘ఆచార్య’ సందడి చేస్తున్నారు. సింగరేణి బొగ్గుగనులకు పుట్టినిల్లయిన ఇల్లెందు ఏరియాలోని జెకె5ఓసీలో మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న

‘ఆచార్య’ వచ్చారు!
మెగాస్టార్‌ చిరంజీవికు స్వాగతం పలుకుతున్న సింగరేణి ఇల్లెందు ఏరియా జీఎం సత్యనారాయణ, చిరంజీవి, రాంచరణ్‌కు స్వాగతం పలుకుతున్న మంత్రి అజయ్‌, నయన్‌

రాంచరణ్‌తో కలిసి ఇల్లెందు బొగ్గుగనుల్లో షూటింగ్‌కు హాజరైన చిరంజీవి

మెగాస్టార్‌కు స్వాగతం పలికిన మంత్రి అజయ్‌, సింగరేణి అధికారులు

నేడు ఖమ్మంలో శ్రీకారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ 

హాజరవనున్న మెగాస్టార్‌ చిరంజీవి, మంత్రి పువ్వాడ 

ఇల్లెందుటౌన్‌/ఖమ్మం ఖానాపురం హవేలి/ ఖమ్మంటౌన్‌, మార్చి7: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ‘ఆచార్య’ సందడి చేస్తున్నారు. సింగరేణి బొగ్గుగనులకు పుట్టినిల్లయిన ఇల్లెందు ఏరియాలోని జెకె5ఓసీలో మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్‌ ఆదివారం ప్రారంభమైంది. షూటింగ్‌కోసం వచ్చిన మెగాస్టార్‌ చిరంజీవికి సింగరేణి ఇల్లెందు ఏరియా జీఎం పీవీ సత్యనారాయణ, ప్రాజెక్టు అధికారి బోళ్లం వెంకటేశ్వర్లు ఘనస్వాగతం పలికారు. ఓసీ వ్యూపాయింట్‌ వద్ద సినిమా యూనిట్‌కోసం గుడారాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 15వరకు ఇల్లెందు ఏరియాలోని వివిధ ప్రాంతాల్లో ఆచార్య చిత్రం కోసం పలు షూటింగులను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. హీరో రాంచరణ్‌, చిత్ర దర్శకుడు కొరటాల శివతోపాటు ఫైట్‌మాస్టర్లు రామ్‌లక్ష్మణ్‌లతో పాటు పలువురు చిత్రయూనిట్‌ సభ్యులు ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. సినిమా షూటింగ్‌ పరిసరాల్లోకి పాత్రికేయులు సహా ఎవరినీ అనుమతించలేదు. అనంతరం మెగాస్టార్‌ చిరంజీవి, రాంచరణ్‌ ఖమ్మంలోని మంత్రి పువ్వాడ నివాసానికి రాగా..  వారికి మంత్రి అజయ్‌, ఆయన కుమారుడు నయన్‌రాజ్‌ ఘన స్వాగతం పలికారు. 

ఖమ్మంలో ‘శ్రీకారం’ ప్రీ రిలీజ్‌..

14రీల్స్‌ బ్యానర్‌పై యువకథానాయకుడు శర్వానంద్‌, హీరోయిన్‌ ప్రియాంకఅరుల్‌ మోహన్‌ నటించిన శ్రీకారం సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలు సోమవారం ఖమ్మం నగరంలోని మమతా కళాశాల మైదానంలో జరగనున్నాయని, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మెగాస్టార్‌ చిరంజీవి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ హాజరవుతున్నట్టు శ్రేయాస్‌ మీడియా ప్రతినిధి దొబ్బల వేణు తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యే ఈ వేడుక కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని, దర్శకుడు డి.కిషోర్‌, సంగీత దర్శకుడు మిక్కీజేమేయర్‌, నటుడు రావురమేష్‌, చిత్రబృందం హాజరవుతున్నట్టు వివరించారు. భారీ పోలీసు బందోబస్తు, కొవిడ్‌ నిబంధనల మధ్య వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో శ్రేయాస్‌ మీడియాప్రతినిధులు నల్లి శ్యామ్‌, నరేష్‌, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-08T06:00:35+05:30 IST