అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయా? ఉండవా?
ABN , First Publish Date - 2021-11-10T15:07:57+05:30 IST
అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లోకి..
అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలల్లోకి తరలింపు
పాఠశాలల్లో ఒక్కో గది కేటాయింపు
దాదాపు 14 వేల కేంద్రాల తరలింపు
స్త్రీ, శిశు సంక్షేమ, విద్యాశాఖ అధికారుల నిర్ణయం
ప్రస్తుతం 58% కేంద్రాలు అద్దెభవనాల్లో..
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లోకి తరలించాలని సంబంధిత శాఖల అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా అద్దె గదుల్లో నిర్వహిస్తున్న వాటిని తరలించాలని నిర్ణయించారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ, విద్యాశాఖ అధికారుల సంయుక్త సమావేశం మంగళవారం జరిగింది. సమావేశంలో ప్రధానంగా ఈ అంశంపై చర్చించారు. వీటి కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో గది అందుబాటులో ఉంచాలన్న నిర్ణయానికి వచ్చారు. పూర్వ ప్రాథమికవిద్యను పాఠశాలవిద్యలో విలీనం చేయాలని నూతన జాతీయ విద్యావిధానం(ఎన్ఈపీ)లో స్పష్టంచేశారు. దీంతో అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయా? ఉండవా? అన్న చర్చ నడుస్తోంది. ఒకవేళ రాష్ట్రంలో ఎన్ఈపీని యథాతథంగా అమలు చేయాల్సి వస్తే, వాటిని ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయవలసి ఉంటుంది. దీనిపై ప్రభుత్వం భవిష్యత్తులో విధానపరమైన నిర్ణయం తీసుకుంటే, పాఠశాలల్లో ఉన్నవాటిని అక్కడికక్కడే విలీనంచేయవచ్చన్నది అధికారుల ఆలోచన.
ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయా పాఠశాలల్లోని గదుల లభ్యత ఆధారంగా దాదాపు 14 వేల అంగన్వాడీ కేంద్రాలను తరలించనున్నారు. రాష్ట్రంలో 149 సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్) ప్రాజెక్ట్ల పరిధిలో 35 వేల అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వాటిలో 31 వేల అంగన్వాడీ కేంద్రాలు, 4 వేల మినీ కేంద్రాలు ఉన్నాయి. కొన్నిటికి సొంత భవనాలు ఉన్నాయి. మరికొన్నిటిని ఇతర ప్రభుత్వశాఖలకు చెందిన భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 15వేల కేంద్రాలు ప్రాథమిక పాఠశాలల్లోనే నడుస్తున్నాయి. 58 శాతం కేంద్రాలు అద్దెభవనాల్లో నడుస్తున్నాయి. స్త్రీ, శిశు సంక్షేమశాఖ వీటికి నెలకు సుమారు రూ.40 కోట్ల వరకు అద్దె చెల్లిస్తోంది. వీటిని ప్రభుత్వ పాఠశాలలకు తరలిస్తే ఈ వ్యయం తగ్గుతుంది.