అదంతా దుష్ప్రచారమే.. క్లారిటీ ఇచ్చేసిన ఎంపీ అసద్

ABN , First Publish Date - 2021-06-22T13:52:42+05:30 IST

ఓవైసీతో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఆస్పత్రిని సందర్శించారు.

అదంతా దుష్ప్రచారమే.. క్లారిటీ ఇచ్చేసిన ఎంపీ అసద్

హైదరాబాద్ సిటీ/అఫ్జల్‌గంజ్‌ : ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం కూల్చివేతను తాము అడ్డుకుంటున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని, తమకు ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు. ఆస్పత్రిలో పడకల సంఖ్య, సదుపాయాలు పెరగాలనేదే తమ ఆకాంక్ష అన్నారు. ప్రజల వైద్య అవసరాల కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. కొత్త భవనం నిర్మించేలా ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే మంచిదని ఆస్పత్రి అధికారుల సమావేశంలో అసదుద్దీన్‌ చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని సూపరింటెండెంట్‌ నాగేందర్‌ చెప్పారు. ఓవైసీతో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఆస్పత్రిని సందర్శించారు.


చెత్తపై అసహనం

ఆస్పత్రి ప్రాంగణం చెత్తా చెదారంతో దుర్గంధభరితంగా ఉండడంతో అసద్‌ అసహనం వ్యక్తం చేశారు. ఆస్పత్రి ఇంత చెత్తగా ఉంటే ఎలా? అని సూపరింటెండెంట్‌ను ప్రశ్నించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, ఇకపై తరచూ అధికారులతో మాట్లాడుతూ ఉంటానని వెల్లడించారు. 


జాక్‌ బృందం వినతి

పాత భవనాన్ని కూల్చి వెంటనే కొత్త భవనం నిర్మించాలని రాష్ట్ర వైద్య జాక్‌ చైర్మన్‌ రమేష్‌, ఓజీహెచ్‌ జాక్‌ ప్రతినిధులు పాండూ నాయక్‌, రామ్‌సింగ్‌ తదితరుల బృందం అసదుద్దీన్‌కు వినతి పత్రం సమర్పించింది. కొత్త భవనంతో మరో 1500 పడకలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. స్థలాభావం, సౌకర్యాల లేమి వల్ల పూర్తిస్థాయిలో శస్త్ర చికిత్సలు నిర్వహించలేకపోతున్నారని అన్నారు. సీఎంతో మాట్లాడతానని అసద్‌ వారికి హామీ ఇచ్చారు.

Updated Date - 2021-06-22T13:52:42+05:30 IST