chennai: కూలీ హత్య కేసు.. కోర్టులో లొంగిపోయిన ఎంపీ
ABN , First Publish Date - 2021-10-12T17:00:15+05:30 IST
ఓ కార్మికుడి హత్యకేసుకు సంబంధించి కడలూరు డీఎంకే లోక్సభ సభ్యుడు టీఆర్వీఎస్ రమేష్ సోమవారం ఉదయం బన్రూట్టి కోర్టులో లొంగిపోయారు. గత కొన్ని రోజులుగా కనిపించకుండాపోయినఆయన.. సోమవారం
చెన్నై: ఓ కార్మికుడి హత్యకేసుకు సంబంధించి కడలూరు డీఎంకే లోక్సభ సభ్యుడు టీఆర్వీఎస్ రమేష్ సోమవారం ఉదయం బన్రూట్టి కోర్టులో లొంగిపోయారు. గత కొన్ని రోజులుగా కనిపించకుండాపోయినఆయన.. సోమవారం హఠాత్తుగా కోర్టు ముందు హాజరవడం చర్చనీయాంశమైంది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే... కడలూరు జిల్లా బన్రూట్టి సమీపంలోని పనికనకుప్పం వద్ద రమేష్ జీడి మామిడి కర్మాగారం నడుపుతున్నారు. ఆ కర్మాగారంలో పని చేస్తున్న పీఎంకేకు చెందిన కార్యకర్త గోవిందరాజు సెప్టెంబరు 19 రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గోవిందరాజును ఎంపీ రమేష్, ఆయన అనుచరులు హత్య చేశారంటూ అతని కుమారుడు సెంథిల్వేల్ కాట్టామ్ పులియూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలంటూ పీఎంకే నేతలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో గోవిందరాజు మృతి కేసును సీబీసీఐడీకి బదిలీ చేస్తూ డీజీపీ శైలేంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు అదనపు డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ గోమతి నాయకత్వంలో సీబీసీఐడీ పోలీసులు గత సెప్టెంబరు 28న విచారణను ప్రారంభించారు. తిరుచ్చి, తిరువణ్ణామలై, విల్లుపురం, కడలూరు జిల్లా జిల్లాలకు చెందిన సీబీసీఐడీ పోలీసులు విచారణ జరిపారు. కాట్టామ్పులియూరు పోలీసుస్టేషన్లో, జీడిమామిడి కర్మాగారంలో సమగ్రంగా దర్యాప్తు జరిపి సాక్ష్యాలను నమోదు చేసి పలువురి నుంచి వాంగ్మూలాలను సేకరించారు. అనంతరం ఈనెల 9వ తేదీన డీఎంకే ఎంపీ రమేష్ సహా ఆరుగురిపై 302 (హత్యకేసు) సెక్షన్ సహా ఆరుసెక్షన్లపై కడలూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో జీడిమామిడి కర్మాగారం కార్మికులు నటరాజన్ (31), కందవేల్ (49), అల్లాపిచ్చై (53), వినోద్ (31), సుందరరాజన్ (31) లను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో లోక్సభ సభ్యుడు రమేష్ కనిపించకుండాపోయారు. ఆయన కోసం సీబీసీఐడీ తీవ్రంగా గాలిస్తుండగా, సోమవారం ఉదయం రమేష్ బన్రూట్టి కోర్టులో మేజిస్ట్రేట్ కర్పగవళ్లి ఎదుట లొంగిపోయారు. ఆయనను రెండు రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు.
నిర్దోషిగా బయటపడతా : రమేష్
సీబీసీఐడీ నమోదు చేసిన హత్య కేసు నుంచి నిర్దోషిగా బయటపడ తానని డీఎంకే ఎంపీ రమేష్ తెలిపారు. ఈ మేర కు ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ.. తన జీడిమామిడి కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికుడు గోవిందరాజ్ మృతి కేసుపై విచారణ జరుపుతున్న సీబీసీఐడీ తనపై నమోదు చేసిన ప్రాథమిక దర్యాప్తు నివే దికను బట్టి రాజకీయ దురుద్దేశంతో ప్రత్యర్థులు డీఎంకేపై తప్పుడు ప్రచారం చేయడం చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యానన్నారు. అందుకే కోర్టులో లొంగిపో యానని పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని న్యాయస్థానం ఎదుట రుజువు చేసి నిర్దోషిగా బయటపడతానని రమేష్ తెలిపారు.