ఏజీ చేస్తున్న వాదనలో పసలేదు : ఎంపీ కనకమేడల
ABN , First Publish Date - 2020-05-31T17:54:23+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై తాజాగా
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై తాజాగా టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ స్పందించారు. నిమ్మగడ్డ విషయమై నిన్న ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరాం సుబ్రమణ్యం మీడియా మీట్ నిర్వహించిన విషయం విదితమే. దీనిపై కనకమేడల మాట్లాడుతూ.. నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు తీర్పును అడ్డుకోవడం సరికాదన్నారు. ఏజీ చేస్తున్న వాదనలో పసలేదన్నారు. న్యాయసలహాదారుగా ఉండి ఇలా చేయడం తగదన్నారు. ఆర్డినెన్స్ చెల్లదని కోర్టు చెప్పాక తీర్పు సరిగా లేదనడం సరికాదన్నారు. ఏజీ ఆఫీసును ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కనకమేడల విమర్శలు గుప్పించారు.
కోర్టుకెళ్లాలే తప్ప...
‘ప్రభుత్వం కావాలంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి కానీ ఏజీ మీడియా సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారు..?. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తప్పుపట్టడం దుర్మార్గం. ప్రభుత్వం ఏజీ ఆఫీస్ని దుర్వినియోగం చేస్తుంది. ప్రభుత్వం నిమ్మగడ్డ విషయంలో సుప్రీం కోర్టుకి వెళ్లి స్టే తెచ్చు కోవచ్చు కానీ అంతకు మించి చేస్తే కోర్ట్ తీర్పులను ఉల్లంఘించడమే. వాదనలు చేయాలంటే కోర్టుకి వెళ్లి చేయాలి.. కానీ మీడియా సమావేశంలో వాదనలు చేస్తే ఏమి ఉపయోగం. న్యాయస్థానం ఇచ్చిన తీర్పులకు వక్రభాష్యం చెబుతున్నారు’ కనకమేడల మండిపడ్డారు.