రాజధానులపై రెఫరెండమ్‌

ABN , First Publish Date - 2020-08-02T08:35:04+05:30 IST

మూడు రాజధానుల అంశంపై రెఫరెండమ్‌ నిర్వహించాలని, అప్పటిదాకా

రాజధానులపై రెఫరెండమ్‌

  • నిర్ణయం నెల వాయిదా వేయాలి
  • అమరావతిలో ఇల్లు కట్టుకుని మోసం
  • దానివల్లే జగన్‌ను నమ్మి గెలిపించారు
  • 13 జిల్లాల ఏపీకి మూడు రాజధానులా?
  • రఘురామరాజు ఆగ్రహం

అమరావతి, న్యూఢిల్లీ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): మూడు రాజధానుల అంశంపై రెఫరెండమ్‌ నిర్వహించాలని, అప్పటిదాకా దానిపై నిర్ణయాన్ని నెలరోజులపాటు వాయిదా వేయాలని వైసీపీ అసమ్మతి ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు కోరారు. ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా ఆ రెఫరెండమ్‌ ఫలితాలు ఉంటే రాజధాని రైతులు ఆందోళనలు చేయబోరన్నారు. రాజధాని అమరావతిలో పెద్దఇల్లు, పార్టీ కేంద్ర కార్యాలయం కట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రజలను మోసం చేశారని, వాటిని చూశాకే ఆయనకు వారు ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయాన్ని అందించారని వ్యాఖ్యానించారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. దక్షిణాఫ్రికాను చూసి రాజధానిని మూడుగా విభజించడం పులిని చూసి నక్క వాతపెట్టుకున్న చందంగా ఉన్నదని వ్యాఖ్యానించారు. కేవలం 13జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులెందుకని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా సుప్రీం కోర్టు నిర్ణయం మేరకు ఏర్పడిన రాష్ట్ర హైకోర్టును కర్నూలుకు తరలించడం సాధ్యంకాదన్నారు. ‘‘ప్రభుత్వం తీసుకొనే ప్రతి నిర్ణయానికీ సీఎం ఆఫీసులో ఉన్న ఒకే ఒక వ్యక్తి కారణం. వైసీపీ క్రమ పతనానికీ ఆయనే కారణం. మంత్రి, సేనాపతి, భట్రాజు అన్నీ ఆ అధికారే. ఆయన్ను పక్కన పెట్టుకుని, ఆయనకు అన్ని అధికారాలు ఇచ్చి సాటి అధికారులను అవమానిస్తున్నారు. నాకు కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు కాకుండా ఆ అధికారే అడ్డుకొన్నారని తెలిసింది కొత్త సీఎం వచ్చిన ప్రతిసారీ రాజధానిని మార్చాలనుకోవడం అవివేకమైన చర్య. ఒక సామాజికవర్గం బలపడుతుందేమోనని రాజధానిని తరలించడం సరికాదు’ అని పేర్కొన్నారు. ప్రజలు, రైతులు ఆందోళన చెందవద్దని, న్యాయమార్గంలో గాంధేయ పద్ధతిలో నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. 

Updated Date - 2020-08-02T08:35:04+05:30 IST