జనసేనతో వైసీపీకి ప్రమాదం.. రఘురామ హెచ్చరిక

ABN , First Publish Date - 2021-03-30T20:46:18+05:30 IST

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా బడ్జెట్‌ను ఆర్డినెన్స్ ద్వారా ప్రవేశపెట్టిన పరిస్థితి లేదని వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు.

జనసేనతో వైసీపీకి ప్రమాదం.. రఘురామ హెచ్చరిక

ఢిల్లీ: దేశంలో ఏ రాష్ట్రంలో కూడా బడ్జెట్‌ను ఆర్డినెన్స్ ద్వారా ప్రవేశపెట్టిన పరిస్థితి లేదని వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు. మంగళవారం రఘురామ మీడియాతో మాట్లాడుతూ.. రానున్న కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉండనుందని.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కనీసం మాటకూడా మాట్లాడడం లేదన్నారు. మరో రోమ్ చక్రవర్తిని ఎన్నుకున్నామన్న భావనలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని ఎద్దేవా చేశారు. రుణ ఆంధ్రప్రదేశ్ నుంచి దివాలా ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం మారే అవకాశాలు తొందరలో ఉన్నాయని ఎంపీ రఘురామకృష్ణంరాజు  హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల కోసం మద్యంపై ఆదాయాన్ని పెంచుకోవాల్సి వస్తుందన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను సీఎంగా చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించడం చూస్తే, తమ పార్టీకి ప్రమాదమేమో అన్న అనుమానం కలుగుతుందని ఎంపీ రఘురామకృష్ణంరాజు  చెప్పారు.


తిరుపతి వేంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించిన తలనీలాలు కూడా అమ్మకపోవడం సిగ్గుచేటన్నారు. స్వామివారి డబ్బులు దొంగిలించిన వారు బాగుపడినట్లు చరిత్రలో లేదన్నారు. ఇన్నిరోజులు ఎర్రచందనం, ఇప్పుడు తలనీలాలు  దొంగిలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ అధికారులు తనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో ఎవరి ఒత్తిడి అయినా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేయమని త్వరలో లేఖ రాస్తానని ఎంపీ రఘురామకృష్ణంరాజు  చెప్పారు. సీఎం పినతండ్రి వివేకానందరెడ్డి హత్య కేసును ఇన్నిరోజులయిన చేధించకపోవడం బాధాకరమని ఎంపీ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.

Updated Date - 2021-03-30T20:46:18+05:30 IST