ఆ ఘటనపై వైసీపీ అసత్య ప్రచారం: ఎంఎస్ రాజు

ABN , First Publish Date - 2021-08-18T02:08:39+05:30 IST

గుంటూరులో జరిగిన ఘటనపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు అన్నారు.

ఆ ఘటనపై వైసీపీ అసత్య ప్రచారం: ఎంఎస్ రాజు

అమరావతి: గుంటూరులో జరిగిన ఘటనపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..వైసీపీ నేతలు, కార్యకర్తలే గొడవ సృష్టించేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు.రాష్ట్రం ఎవరబ్బ జాగీరు? అని  వైసీపీ నేతల తీరును ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా బాధిత కుటుంబాన్ని పరామర్శించే హక్కు లోకేశ్‌కి లేదా అని నిలదీశారు. దళిత కుటుంబానికి న్యాయం చేయాలన్న.. లోకేశ్ నాలుక కోస్తామంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  


దళితులకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించకుడదా అని ధ్వజమెత్తారు. డాక్టర్ సుధాకర్‌ని కొట్టి చంపినపుడు, శివప్రసాద్‌కి శిరోముండనం చేసినపుడు, మాస్క్ లేదని చీరాలలో కిరణ్‌ని కొట్టి చంపినప్పుడు వైసీపీ నేతలు ఏ కలుగులో దాక్కున్నారు? అని ప్రశ్నించారు.వైసీపీ పాలనలో దళితులపై వందలాది దాడులు జరిగితే.. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందన్నారు.అనంతపురంలో స్నేహలత ఘటన, పులివెందులలో నాగమ్మ అత్యాచారం ఘటనపై చర్యలు తీసుకుని ఉంటే రమ్య ప్రాణాలు కోల్పోయేదా? అని ప్రశ్నించారు.ఎల్జీపారిమర్స్ ఘటనలో స్పెషల్ ప్లైట్ వేసుకుని వెళ్లి చనిపోయిన వారికి రూ. కోటి ఇచ్చిన జగన్.. తన ఇంటికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న దళిత యువతి రమ్యశ్రీ కుటుంబాన్ని పరామర్శించలేరా అని నిలదీశారు. సాయంలో వివక్ష, పరామర్శలో వివక్ష సిగ్గుచేటని ఎంఎస్ రాజు విమర్శించారు.

Updated Date - 2021-08-18T02:08:39+05:30 IST