యూపీలో బీజేపీకి మరో షాక్...
ABN , First Publish Date - 2022-01-13T17:14:00+05:30 IST
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ బీజేపీకి గురువారం మరో షాక్ తగిలింది....
మూడు రోజుల్లో 7వ ఎమ్మెల్యే బీజేపీకి గుడ్ బై
లక్నో: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ బీజేపీకి గురువారం మరో షాక్ తగిలింది. ఉత్తరప్రదేశ్లో మరో బీజేపీ ఎమ్మెల్యే ముఖేష్ వర్మ గురువారం రాజీనామా చేశారు. గత రెండు రోజులుగా రాజీనామా చేసిన ఏడో ఎమ్మెల్యే ఆయన.ఉత్తరప్రదేశ్లో పెరుగుతున్న బీజేపీ ఎమ్మెల్యేల రాజీనామాలతో కమలనాథుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖేష్ వర్మ ఫిరోజాబాద్లోని షికోహాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లోని దళితులు, ఇతర వెనుకబడిన తరగతులు, మైనారిటీ వర్గాలు, రైతులు, నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసిందని ముఖేష్ వర్మ ఆరోపించారు.‘‘బీజేపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాలనలో దళిత, వెనుకబడిన, మైనారిటీ వర్గాల నాయకులు, ప్రజాప్రతినిధులను పట్టించుకోలేదని, ఈ వర్గాలను నిర్లక్ష్యం చేశారని, అందుకే భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. ’’ అని వర్మ ట్వీట్ చేశారు.
వెనుకబడిన వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య రాష్ట్ర మంత్రివర్గం నుంచి వైదొలిగారు.మరో బీజేపీ ఎమ్మెల్యే అవతార్ సింగ్ భదానా బుధవారం పార్టీని వీడి, ఎస్పీ మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్దళ్లో చేరారు.మౌర్య మద్దతుతో మరో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.మంగళవారం బీజేపీ ఎమ్మెల్యేలు తింద్వారీకి చెందిన బ్రజేష్ ప్రజాపతి, తిల్హర్కు చెందిన రోషన్ లాల్ వర్మ, బిల్హౌర్కు చెందిన భగవతి సాగర్ భాజపాని వీడుతున్నట్లు ప్రకటించారు.అయితే ఇద్దరు ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. కాంగ్రెస్ నుంచి నరేష్ సైనీ, సమాజ్ వాదీ పార్టీ నుంచి హరి ఓం యాదవ్ బుధవారం బీజేపీలో చేరారు.