పార్లమెంటును చేపల బజారుగా మార్చొద్దు : నఖ్వీ

ABN , First Publish Date - 2021-08-04T19:24:30+05:30 IST

పార్లమెంటును చేపల బజారుగా మార్చొద్దని కేంద్ర మంత్రి

పార్లమెంటును చేపల బజారుగా మార్చొద్దు : నఖ్వీ

న్యూఢిల్లీ : పార్లమెంటును చేపల బజారుగా మార్చొద్దని కేంద్ర మంత్రి, బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ప్రతిపక్షాలను కోరారు. పార్లమెంటు గౌరవాన్ని మంట కలుపుతున్నారని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పప్రి చాట్ ఇష్టపడకపోతే చేపల కూర తినొచ్చని ఆయనకు సలహా ఇచ్చారు. 


ఒబ్రెయిన్ ఇటీవల ఇచ్చిన ఓ ట్వీట్‌లో మోదీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి 10 రోజుల్లో మోదీ-షా 12 బిల్లులను ప్రవేశపెట్టి, ఆమోదం పొందారని తెలిపారు. ఒక్కొక్క బిల్లును సగటున ఏడు నిమిషాల్లోనే ఆమోదించుకుంటున్నారని దుయ్యబట్టారు. చట్టాలను ఆమోదించుకుంటున్నారా? పప్రి చాట్ తయారు చేస్తున్నారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. 


ఈ నేపథ్యంలో ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందిస్తూ, డెరెక్ ఒబ్రెయిన్‌కు పప్రి చాట్ అంటే ఎలర్జీ అయితే, చేపల కూర తినొచ్చన్నారు. పార్లమెంటును చేపల బజారుగా మార్చకూడదని హితవు పలికారు. దురదృష్టవశాత్తూ, పార్లమెంటు గౌరవాన్ని దిగజార్చే కుట్రతో జరుగుతున్న కార్యక్రమాలు గతంలో ఎన్నడూ కనిపించలేదన్నారు. 


జూలై 19న పార్లమెంటు వర్షాకాలం సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పెగాసస్ స్పైవేర్ ప్రాజెక్టుపై విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్షాల నిరసనల మధ్య ప్రభుత్వ బిల్లులు ఆమోదం పొందుతున్నాయి.


Updated Date - 2021-08-04T19:24:30+05:30 IST