మమతను కలిసిన ముకుల్ రాయ్..కీలన ప్రకటనకు అవకాశం
ABN , First Publish Date - 2021-06-11T21:08:42+05:30 IST
బీజేపీ నుంచి మళ్లీ టీఎంసీ గూటికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ చేరనుండటం..
కోల్కతా: బీజేపీ నుంచి మళ్లీ టీఎంసీ గూటికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ చేరనుండటం దాదాపు ఖాయమైంది. ఆయన టీఎంసీలో తిరిగి చేరే అవకాశం ఉందన్న ఊహాగానాలకు బలం చేకూరుస్తూ శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఆయన కోల్కతాలోని టీఎంసీ భవన్కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ సీనియర్ నాయకులతో టీఎంసీ భవన్లో సమావేశం ఏర్పాటు చేశారు. ముకుల్రాయ్ పార్టీ కార్యాలయానికి చేరుకోవడంతో ఆయన తిరిగి టీఎంసీ గూటికి చేరడం లాంఛనమేనని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం పూర్తి కాగానే టీఎంసీలో చేరికపై ముకుల్ రాయ్ ప్రకటన చేసే అవకాశం ఉందని టీఎంసీ భవన్ వర్గాలు చెప్పాయి. కొద్దికాలంగా బీజేపీలో ముకుల్ రాయ్ ఇమడలేకపోతున్నట్టు చెబుతున్నారు. పశ్చిమబెంగాల్లో టీఎంసీ ఘనవిజయం సాధించిన నెల రోజుల తర్వాత మమతను ముకుల్రాయ్ కలుసుకోవడం ఇదే ప్రథమం. టీఎంసీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన ముకుల్ రాయ్ 2017లో బీజేపీలో చేరారు.