రూ. 20ల దొంగతనం.. మూడేళ్ల జైలు శిక్ష!

ABN , First Publish Date - 2021-06-14T20:20:01+05:30 IST

మహారాష్ట్రా రాజధాని ముంబైకి చెందిన 26 ఏళ్ల కార్మికుడికి బాంద్రా మెట్రోపాలిటన్ కోర్టు తాజాగా 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఓ వ్యక్తి నుంచి రూ. 20ల దొంగిలించిన ఘటనకు సంబంధించిన కేసులో..

రూ. 20ల దొంగతనం.. మూడేళ్ల జైలు శిక్ష!

ముంబై: మహారాష్ట్రా రాజధాని ముంబైకి చెందిన 26 ఏళ్ల కార్మికుడికి బాంద్రా మెట్రోపాలిటన్ కోర్టు తాజాగా 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఓ వ్యక్తి నుంచి రూ. 20ల దొంగిలించిన ఘటనకు సంబంధించిన కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. విచారణ సందర్భంగా..నిందుతుడు తన నేరాన్ని అంగీకరించాడు. అయితే..దొంగతనం చేసే సమయంలో నిందితుడితో జరిగిన ఘర్షణ కారణంగా బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడని పేర్కొన్న న్యాయస్థానం.. నిందితుడికి మూడేళ్ల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా.. నిందితుడు అర్జున్ గైక్వాడ్ ఏడునెలల నుంచి జుడిషియల్ కస్టడీలో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అతడు నేరం చేసినట్టు అంగీకరిస్తూ మార్చి నెలలో న్యాయస్థానానికి ఓ లేఖ ద్వారా తెలియజేశాడు. ఇక.. అతడు స్వచ్ఛందంగా నేరం అంగీరించినట్టు కోర్టు భావిస్తున్నట్టు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. ఇప్పటికే అతడు ఏడునెలలకు పైగా జైలు జీవితం గడిపిన విషయాన్ని పరిగణలోకి తీసుకుంటూ జడ్జి నిందితుడికి మూడేళ్ల శిక్ష విధించింది. ఐపీసీ చట్టాల ప్రకారం.. దోపిడీ సమయంలో బాధితుడు గాయపడినట్టైతే నిందితుడికి గరిష్టంగా పదేళ్ల వరకూ జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. నేర తీవ్రతను బట్టి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షను కూడా విధించొచ్చు.

Updated Date - 2021-06-14T20:20:01+05:30 IST