సోదరుడి హంతకుడిని హతమార్చేందుకు సోదరి ప్రేమ వల

ABN , First Publish Date - 2021-01-12T13:33:32+05:30 IST

తన సోదరుడిని చంపిన హంతకుడిని హత్య చేసేందుకు సాక్షాత్తూ మృతుడి సోదరి హంతకుడిపై హనీ ట్రాప్ (ప్రేమ వల) విసిరిన...

సోదరుడి హంతకుడిని హతమార్చేందుకు సోదరి ప్రేమ వల

ముంబై (మహారాష్ట్ర): తన సోదరుడిని చంపిన హంతకుడిని హత్య చేసేందుకు సాక్షాత్తూ మృతుడి సోదరి హంతకుడిపై హనీ ట్రాప్ (ప్రేమ వల) విసిరిన ఉదంతం మహారాష్ట్రలోని ముంబై నగరంలో వెలుగుచూసింది. బాలీవుడ్ క్రైం థ్రిల్లర్ సినిమాను పోలేలా జరిగిన ఈ కుట్రను ముంబై పోలీసులు బట్టబయలు చేశారు. తన సోదరుడి హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు మృతుడి సోదరి పన్నిన హనీట్రాప్ ఉదంతం ముంబై నగరంలో సంచలనం రేపింది. 2020 జూన్ నెలలో ముంబై నగరంలోని మలాద్ ప్రాంతంలో వాహనాల పార్కింగ్ విషయంలో రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో నిందితుడు మహ్మద్ సాధిక్ 24 ఏళ్ల వయసుగల అల్తాఫ్ ను హత్య చేశాడు. హత్య చేశాక హంతకుడు సాధిక్ ఢిల్లీకి పారిపోయాడు. సోదరుడు అల్తాఫ్ హత్య సంఘటనతో షాక్ కు గురైన అతని సోదరి యాస్మీన్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. అల్తాఫ్ స్నేహితులు ఫరూక్, ఒవైస్, మనీస్, జాకీర్ ఖాన్, సత్యంపాండే ల సహాయంతో హంతకుడు సాధిక్ ను చంపాలని యాస్మీన్ నిర్ణయించుకుంది.


 సాధిక్ రాగానే ఈ ముఠా అతన్ని కిడ్నాప్ చేసి వసాయినైగావ్ లోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి అతన్ని చంపి మృతదేహాన్ని పారవేయాలని నిర్ణయించారు. సాధిక్ ను బలవంతంగా అంబులెన్సులో ఎక్కించడం చూసిన స్థానికుడొకరు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తమై అంబులెన్సును గుర్తించారు. అంతలో అంబులెన్సులో పెట్రోలు అయిపోవడంతో వారు మరో కారును అద్దెకు తీసుకున్నారు. కారులో వెస్ట్రన్ జాతీయ రహదారిపై వెళుతుండగా దహిసర్ చెక్ నాకా గుండా వెళుతుండగా పోలీసులు యాస్మిన్ తో సహా అందరినీ అరెస్టు చేసి సాధిక్ ను రక్షించారు. అయితే సాధిక్ ను మునుపటి అల్తాఫ్ హత్య కేసులో పోలీసులు అరెస్టు చేశారు.



 అల్తాఫ్ హత్య జరిగిన నెల రోజుల తర్వాత యాస్మిన్ అల్తాఫ్ స్నేహితులను మాల్వాలో కలిసి హంతకుడు సాధిక్ ను చంపడానికి కుట్ర పన్నారు. వారు మొదట సాధిక్ ను ఢిల్లీ నుంచి ముంబైకు రప్పించేందుకు హనీట్రాప్ చేయాలని నిర్ణయించుకున్నారు.దీనికోసం యాస్మిన్ నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరచి సాధిక్ తో ఛాటింగ్ చేయడం ప్రారంభించింది. దీంతో సాధిక్ ప్రేమలో పడ్డాడు. ఢిల్లీలో ఉన్న సాధిక్ యాస్మిన్ ను కలవడానికి ముంబై వచ్చాడు. యాస్మిన్ అతన్ని ఆరేలోని చోటా క్మీర్ ప్రాంతానికి పిలిచింది. సాధిక్ అక్కడకు చేరుకున్నపుడు యాస్మిన్ కు బదులుగా అల్తాఫ్ ఐదుగురు స్నేహితులు అంబులెన్సులో ఎదురు చూస్తూ ఉన్నారు.

Updated Date - 2021-01-12T13:33:32+05:30 IST