‘ముంపు’ కట్టుకథే

ABN , First Publish Date - 2020-09-29T07:47:39+05:30 IST

సెప్టెంబరు నెల వస్తోందంటే... గుంటూరు జిల్లాలో కొండవీటి వాగును ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వరద భయం ఆవహించేది.

‘ముంపు’  కట్టుకథే

అమరావతిని అటకెక్కించేందుకే అబద్ధం

మునిగిపోతుందంటూ వైసీపీ ప్రచారం

తాజా వర్షాలకు పొంగిన కొండవీటి వాగు

అయినా... ఎక్కడా కనిపించని ముంపు

ఆదుకున్న కొండవీటి ఎత్తిపోతల పథకం

గత ప్రభుత్వ హయాంలోనే నిర్మాణం



అమరావతి ముంపు ప్రాంతమన్నారు. గట్టిగా వాన కురిస్తే అంతా మునిగిపోతుందన్నారు.  భారీ వర్షాల సమయంలో పొంగిపొర్లే ‘కొండవీటి’ వాగుకు కళ్లెం వేసి, వరద నీటిని కృష్ణాలో కలిపేందుకు గత ప్రభుత్వమే ఎత్తిపోతల పథకం కట్టినా... కావాలనే విస్మరించారు.  తాజా వర్షాలకు కొండవీటి వాగు పొంగినా... రాజధాని గ్రామాల్లో ఎక్కడా చిన్నపాటి ప్రాంతం కూడా ముంపునకు గురి కాలేదు. కారణం... కొండవీటి ఎత్తిపోతల సమర్థంగా పని చేయడమే! దీంతో... ‘అమరావతి మునిగిపోతుంది’ అని చేసిన ప్రచారంలో నిజం లేదని స్పష్టమైంది. ఇక కృష్ణా నదికి భారీ వరద వచ్చినా అమరావతి గ్రామాలకు ప్రమాదం లేదని గత ఏడాదే రుజువైంది.



(అమరావతి - ఆంధ్రజ్యోతి)

సెప్టెంబరు నెల వస్తోందంటే... గుంటూరు జిల్లాలో కొండవీటి వాగును ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వరద భయం ఆవహించేది. వర్షాలకు ఊళ్లలోకి వరద నీళ్లు వచ్చేవి. ఇళ్లు, పంటలు, పశువులను కోల్పోయి ప్రజలు కట్టుబట్టలతో సహాయక శిబిరాల్లో రోజులకు రోజులు గడపాల్సి వచ్చేది. దీంతో ఈ వాగుకు దుఖఃదాయినిగా పేరుపడింది. ఈ స్థితిలో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ఎత్తిపోతల పథకం.. కొండవీటివాగు ఏటా తెచ్చే వరద ముప్పును శాశ్వతంగా తప్పించింది.


గుంటూరు జిల్లాలో కొండవీటివాగు 29 కి.మీ. ప్రవహిస్తుంది. ఈ పరిధిలో 29 గ్రామాలున్నాయి. వర్షాకాలమొస్తే ఈ గ్రామాల్లో హాహాకారాలే. అలాంటిచోట 2015లో రాజధాని అమరావతి నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఏటా వచ్చే వరద ముప్పు సమస్య రాజధానివాసులకు ఉండకూడదని అప్పటి ప్రభుత్వం భావించింది. సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఉద్దేశంతో కొండవీటివాగు ఎత్తిపోతల పథకాన్ని తలపెట్టారు. అలాగే, మంచినీటి అవసరాలను తీర్చే ప్రధాన ప్రాజెక్టుగానూ అప్పట్లో పథక నిర్మాణ ప్రణాళిక జరిగింది.


ప్రకాశం బ్యారేజీ నుంచి గుంటూరు చానల్‌కు కొండవీటివాగును అనుసంధానం చేయడం ద్వారా వరదముప్పును నివారించొచ్చునని చంద్రబాబు ప్రభుత్వం యోచించింది. ఈ యోచనకు సమగ్ర రూపమే కొండవీటివాగు ఎత్తిపోతల పథకం. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ప్రభుత్వం.. నిపుణుల కమిటీని వేసింది. ఉండవల్లి ఎగువభాగాన కొండవీటివాగు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని కమిటీ 2015 మార్చిలో నివేదిక ఇచ్చింది. దానిని ప్రభుత్వం ఆమోదించి 2016లో టెండర్లను పిలిచింది. రూ.237 కోట్లతో 2017 మార్చి 30న  ఈ పథకానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.


రికార్డు స్థాయిలో 2018 సెప్టెంబరు 16న ఈ పథకాన్ని పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించింది.


16 పంపులు.. 

ప్రకాశం బ్యారేజీ, బకింగ్‌హామ్‌ కెనాల్‌, కొండవీటి వాగులను కలిపేలా ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు.  వరద జలాలను ఎత్తిపోవడానికి 16 పంపులు, 16 మో టార్లు ఏర్పాటు చేశారు. ఒక్కో పంపు నుంచి 350 క్యూసెక్కులు పంపింగ్‌ చేసే వీలుంది. ఈ పథకం ద్వారా రోజూ గుంటూరు చానల్‌కు నీటిని మళ్లించేందుకు వీలయింది.


వరదను అంచనావేసి ముందస్తుగా నీటిని గుంటూరు చానల్‌కు మళ్లించడం వల్ల కృష్ణా జ లాలను వృఽథాగా సముద్రంలోకి వెళ్లడాన్ని కూడా నివారించగలిగారు. ప్రకాశం బ్యారేజీలోకి అనూహ్యంగా వస్తున్న వరద జలాలను మళ్లించడం ద్వారా .. అమరావతి ప్రాంతంలోనే కాకుండా..కృష్ణా పరివాహక ప్రాంతాల్లోనూ ముంపు ముప్పును తొలగించేందుకు వీలయింది.


Updated Date - 2020-09-29T07:47:39+05:30 IST