ముంచుకొస్తున్న గడువు

ABN , First Publish Date - 2020-11-23T06:27:59+05:30 IST

‘‘వచ్చే నెల ఒకటో తేదీనాటికి నగరంలో డంపర్‌ బిన్లన్నింటినీ తీసేస్తాం. పారిశుధ్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి చెత్తను సేకరిస్తారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా నగరాన్ని డంపర్‌ బిన్‌ ఫ్రీ సిటీగా తయారుచేస్తాం’’ అని జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన ఇటీవల ఘనంగా ప్రకటించారు.

ముంచుకొస్తున్న గడువు

ఒకటి నుంచి డంపర్‌బిన్లు ఎత్తివేత

రోజూ ఇంటింటా చెత్త సేకరణ

జీవీఎంసీ కమిషనర్‌ ఆదేశం

అమలుపై అధికారులు సందిగ్ధం

పూర్తిస్థాయిలో లేని పారిశుధ్య సిబ్బంది

కొరవడిన పక్కా ప్రణాళిక

‘డంపర్‌ బిన్‌ ఫ్రీ సిటీ’ అమలుపై అధికారులు డైలమా 

రోడ్లు, గెడ్డల్లో చెత్తవేసేవారిని గుర్తించడం ఎలా అని మల్లగుల్లాలు


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం)

‘‘వచ్చే నెల ఒకటో తేదీనాటికి నగరంలో డంపర్‌ బిన్లన్నింటినీ తీసేస్తాం. పారిశుధ్య సిబ్బంది  ప్రతి ఇంటికి వెళ్లి చెత్తను సేకరిస్తారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా నగరాన్ని డంపర్‌ బిన్‌ ఫ్రీ సిటీగా తయారుచేస్తాం’’ అని జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన ఇటీవల ఘనంగా ప్రకటించారు. చెప్ప డానికి ఇది చాలాబాగున్నప్పటికీ... ఆచరణ ఎలా? అన్నదానిపై జీవీఎంసీ అధికారుల వద్ద సమాధానం లేదు. ప్రజలు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి రోజూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడానికి సరిపడా పారిశుధ్య సిబ్బంది లేరని, డంపర్‌ బిన్లు అన్నింటినీ తీసేస్తే ప్రజలు చెత్తాచెదారాన్ని వీధుల్లో పడేస్తారని, అప్పుడు పారిశుధ్య సమస్య మరింత తీవ్రంగా మారుతుం దని అధికారులు ఆందోళన చెందుతున్నారు. 


జీవీఎంసీ పరిధిలో సుమారు 5.5 లక్షల వరకు నివాసాలు, వాణిజ్య సముదాయాలు, దుకాణాలు ఉన్నాయి. వీటన్నింటి నుంచి ప్రతిరోజూ 1,100 టన్నుల వరకు చెత్త ఉద్భవిస్తున్నది. జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం సిబ్బంది నిత్యం ఈ చెత్తను సేకరిస్తున్నారు. వీరుకాకుండా మరో 250 వ్యాన్‌లను అద్దెకు తీసుకుని, రోజూ ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో సిబ్బంది వీధుల్లోకి వెళ్లి తడి, పొడి చెత్తను సేకరించి వాహనాల్లో వేసుకుని సమీపంలోని సివేజ్‌ ఫారానికి తరలిస్తున్నారు. ఇక డంపర్‌ బిన్లలోని చెత్తను ప్రత్యేక వాహనాల ద్వారా సేకరించి సివేజ్‌ ఫారానికి పంపుతు న్నారు. డంపర్‌ బిన్లు ఖాళీ చేసి, 24 గంటల్లోనే పూర్తిగా నిండిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితు ల్లో డంపర్‌బిన్లను తీసేసి, ప్రతి ఇంటి నుంచి నిత్యం తడి, పొడి చెత్తలను ఇంట్లో పోగయ్యే చెత్తను వీధిలోకి వచ్చే చెత్తవాహనానికే అందజేసేలా చేయాలని జీవీఎంసీ ఉన్నతాధికారులు నిర్ణయించడం సర్వత్రా అయోమయానికి గురిచేస్తోంది.


అమలుపై అధికారుల్లోనే స్పష్టత కరువు

డంపర్‌బిన్లను పూర్తిగా తొలగిస్తే రోడ్లపై చెత్తలేకుండా చేయడం ఎలా అనేదానిపై జీవీఎంసీ అధికారుల్లోనే స్పష్టత లేనిపరిస్థితి నెలకొంది. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ జరుగుతున్నప్పటికీ.... వీధుల్లో ఏర్పాటుచేసిన డంపర్‌బిన్లు చెత్తతో నిండిపోతున్నాయి. ఒకవేళ చెత్తవాహనం వీధిలోకి వచ్చినప్పుడు ఎవరైనా సొంత పనిమీద బయటకు వెళితే.. వారి చెత్త పరిస్థితి ఏమిటి? ఒకవేళ చెత్త తరలించే వాహనం ఏదైనా కారణంతో ఆగిపోయితే ఆరోజు చెత్త సేకరణ ఎలా? అనేదానిపై అధికారుల వద్ద సమాధానం లేదు. అంతేకాక నగరంలో ప్రతి ఇల్లు, షాపు, వ్యాపార సముదాయాల నుంచి రోజూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడానికి సరిపడ సిబ్బంది లేరని అధికారులు అంటున్నారు. కాగా  చెత్తను రోడ్డుపైనగానీ, గెడ్డల్లోగానీ వేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్న అధికారులు, చెత్తను రోడ్లపై ఎవరు వేస్తున్నారనేది ఎలా గుర్తించగలమని కిందిస్థాయి అధికారులు, సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ప్రజల నుంచి సరైన రీతిలో చెత్తను సేకరించే పరిస్థితి కల్పించకుం డా... జరిమానాల పేరుతో భయపెడితే ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురయ్యే పరిస్థితి లేకపోలేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. డంపర్‌బిన్‌రహిత నగరంగా ప్రకటించుకునేందుకు ప్రత్యమ్నాయ చర్యలపై దృష్టిసారించకుండా హడావుడిగా డంపర్‌బిన్లన్నింటినీ తొలగిస్తామని చెప్ప డంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అధికారులు కూడా ఏదో ప్రకటించేశాం... అక్కడితో లక్ష్యం నెరవేరిపోయిందన్న భావనతో ఉన్నారు తప్పితే.... ఆచరణ ఎలా అనేదానిపై స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకోకపోవడం గమనార్హం. 


Updated Date - 2020-11-23T06:27:59+05:30 IST