వ్యాపారి హత్య
ABN , First Publish Date - 2021-09-19T05:11:03+05:30 IST
ప్రశాంతంగా వున్న జంగారెడ్డిగూడెం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పాల వ్యాపారి సురేష్ హత్యతో పట్టణంలో కలకలం రేపింది.
జంగారెడ్డిగూడెంలో కలకలం
కొబ్బరి బొండాల కత్తితో దాడి
వివాహేతర సంబంధమే కారణం !
జంగారెడ్డిగూడెం టౌన్, సెప్టెంబరు 18 : ప్రశాంతంగా వున్న జంగారెడ్డిగూడెం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పాల వ్యాపారి సురేష్ హత్యతో పట్టణంలో కలకలం రేపింది. శుక్రవారం అర్ధరాత్రి పట్టణ నడిబొడ్డున రోడ్డుపై కొబ్బరి బొండాల కత్తితో నరికి హత మార్చిన ఘటనతో స్థానికులు హతాశులయ్యారు. పోలీసులు తెలిపిన వివరా లివి.. పట్టణానికి చెందిన కందుకూరి సురేష్(55) పాల వ్యాపారం చేస్తున్నాడు. అతని షాపులో పనిచేసే మహిళతో అతనికి ఇటీవల సాన్నిహిత్యం పెరిగింది. అయితే ఆమెకు గతంలో యానాంకు చెం దిన చిరంజీవి అనే పెయింటర్తో పరిచయం ఉంది. పెయింటింగ్ పనుల నిమిత్తం అతను పట్టణానికి వచ్చి వెళుతుంటాడు. భర్తతో విడాకులు తీసుకున్న ఆమెతో కొంత కాలం సహ జీవనం చేసినట్లు సమాచారం. ఇటీవల సురేష్తో ఆమె సాన్నిహిత్యంగా ఉండటం సహించలేక అతడిని హతమార్చేందుకు చిరంజీవి పన్నాగం వేశాడు.ప్రతీరోజు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పాల వాహనం వస్తూ ఉంటుంది. సరుకు అన్లోడ్ చేసుకుని, అనంతరం సురేష్ ఆ మహిళను ఇంటి వద్ద దింపేవాడు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధ రాత్రి పాల వాహనంలో సరుకు దింపుకొని రాత్రి సుమారు రెండు గంటల సమయంలో ఆమెను ఇంటి వద్ద దింపేందుకు వెళ్లాడు. అక్కడే కాపు కాసిన చిరంజీవి వారిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఆ మహిళకు చెవి వద్ద కత్తి గాటు పడటంతోనే అక్కడ నుంచి ఆమె తప్పించుకుని పారిపోయింది. తర్వాత సురేష్ను కత్తితో తల, మెడపై బలంగా నరికాడు. అతను కేకలు వేయడంతో అక్కడకు చేరుకున్న స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. అందులో ఏరియా ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా, మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సురేష్ మర ణించాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనిపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సురేష్కు భార్య, కుమార్తె ఉన్నారని పోలీసులు తెలిపారు.