విజయవాడలో దారుణ హత్య.. ప్లాన్ ఆ మహిళదేనా..!?

ABN , First Publish Date - 2020-10-11T15:12:30+05:30 IST

కృష్ణా జిల్లాలో దారుణ హత్య జరిగింది.

విజయవాడలో దారుణ హత్య.. ప్లాన్ ఆ మహిళదేనా..!?

విజయవాడ : కృష్ణా జిల్లాలో దారుణ హత్య జరిగింది. జిల్లాలోని నున్న శివారులో స్నేహితులతో కలిసి మద్యం తాగేందుకు వెళ్లిన మహేష్‌ అనే వ్యక్తిని కొందరు గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్యచేశారు. మహేష్ పోలీస్‌ కమిషనరేట్‌లో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. పక్కాగా రెక్కీ నిర్వహించి మరీ మహేష్‌ను దుండగులు దారుణంగా హత్య చేశారు. స్కూటీపై వచ్చిన ఇద్దరు దుండగులు పిస్టల్‌తో ఐదు రౌండ్లు కాల్పులు జరిపారని వార్తలు వస్తున్నాయి. పాయింట్ బ్లాంక్‌లో కాల్చిన దుండుగులు .. అనంతరం పారిపోయారు. మహేష్ గొంతు, ఛాతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. మరో బుల్లెట్ పొట్టలోకి దూసుకెళ్లింది. స్థానికులు అతడ్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించాడు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది.


కాగా.. ప్రత్యేక బృందంతో పాటు పోలీసులు సైతం కేసును దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ బైపాస్‌ రోడ్డులోని సుబ్బారెడ్డి బార్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీసీ ఫుటేజ్‌‌ను బెజవాడ పోలీసులు పరిశీలిస్తున్నారు. మహేష్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసలు ఈ కారు ఎవరి పేరిట ఉంది..? అసలు ఈ దారుణానికి పాల్పడిందెవరు..? అనే విషయాలపై పోలీసులు నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కాల్పుల వెనుక ఓ మహిళ హస్తం ఉందని సమాచారం. ఓ మహిళే మహేష్ హత్యకు ప్లాన్ చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Updated Date - 2020-10-11T15:12:30+05:30 IST