ఆస్తిగొడవల్లో యువకుడి హత్య
ABN , First Publish Date - 2022-01-19T06:54:15+05:30 IST
ఆస్తిగొడవల్లో తలెత్తిన వివాదంలో ఓ యువకుడు హత్యకు గురైన సంఘటన పాకాల మండలం పదిపుట్లబైలు పంచాయతీ కొండకింద పల్లెలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
పాకాల, జనవరి 18: ఆస్తిగొడవల్లో తలెత్తిన వివాదంలో ఓ యువకుడు హత్యకు గురైన సంఘటన పాకాల మండలం పదిపుట్లబైలు పంచాయతీ కొండకింద పల్లెలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. సీఐ ఆశీర్వాదం తెలిపిన ప్రకారం.. కొండకిందపల్లెలో బి.కృష్ణయ్య, సురేంద్ర అన్నదమ్ములు. వీరి కుటుంబాల మధ్య వ్యవసాయ భూములు.. ఇంటివద్ద దారి సమస్యలున్నాయి. ఆరు నెలల కిందట గ్రామంలో పెద్దలు సర్దుబాటు చేశారు. మూడు రోజుల క్రితం సురేంద్ర కుమారుడు రవికుమార్ (32) పొలం సరిహద్దు వద్ద పనులు చేశాడు. ఆ సందర్భంగా కృష్ణయ్య భార్య ఆదిలక్ష్మి, రవికుమార్ మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో పొలం వద్ద పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న రవికుమార్పై కృష్ణయ్య, ఆయన భార్య ఆదిలక్ష్మి, కుమారులు శ్రీనివాసులు, మల్లికార్జున దాడి చేశారు. బండరాయి, ఇటుకలతో కొట్టిచంపారు. మృతుడి తండ్రి సురేంద్ర ఫిర్యాదు మేరకు సీఐ ఆశీర్వాదం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు.