మత సామరస్యం
ABN , First Publish Date - 2020-07-13T10:38:49+05:30 IST
బోనాల ఉత్సవాలలో అమ్మవారి ఘటాల ఊరేగింపునకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.
ముషీరాబాద్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): బోనాల ఉత్సవాలలో అమ్మవారి ఘటాల ఊరేగింపునకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. దేవాలయపుర వీధులలో అమ్మవారి ఘటాన్ని ఊరేగిస్తూ భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఘటాల తయారీని అత్యంత పవిత్ర కార్యక్రమంగా భావిస్తారు. ముషీరాబాద్లోని శ్రీ మహంకాళి అమ్మవారి ఘటాన్ని 35 ఏళ్లుగా తయారుచేస్తూ.. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు బాబూలాల్. ముషీరాబాద్ భరత్నగర్కు చెందిన బాబులాల్ వృత్తిరీత్యా పూల వ్యాపారి. ఆయన ప్రతి రోజూ 25 పైసల పూలను అమ్మవారి పూజకు ఇవ్వడం 35 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. నాటి నుంచి పూలను ఇస్తూనే ఉన్నారు.
2005లో శ్రీమహంకాళి దేవాలయం నుంచి అమ్మవారి ఘటాన్ని తయారు చేయాల్సిందిగా ఆలయ నిర్వాహకులు బాబులాల్ను కోరారు. ఆయన అంగీకరించి ఆనాటి నుంచి నేటి వరకు ఘటాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో అలంకరిస్తున్నారు. ఈ ఆదివారం నుంచి ప్రారంభమైన బోనాల ఉత్సవాలకు భార్య సూల్తానా బేగం సహాయంతో అమ్మవారి ఘటాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఈ ఘటాన్ని ఆలయ పురవీధుల్లో ఈ నెల 19 వరకు ఊరేగిస్తూ భక్తులకు దర్శనం కల్పిస్తారు. బాబులాల్ కుమారులు సైతం ఏటా బోనాల ఉత్సవాలకు దేవాలయాన్ని పూలతో అలంకరిస్తారు.
భక్తిశ్రద్ధలతో ఘటాన్ని తయారు చేస్తాం ..బాబులాల్
గత 35 ఏళ్లుగా అమ్మవారి పూజ కోసం పూలను రోజూ అందిస్తున్నాను. గత 15 సంవత్సరాలుగా అమ్మవారి ఘటాన్ని తయారుచేస్తున్నాను. నేను ముస్లిం అయినప్పటికీ అమ్మవారి ఘటాన్ని తయారుచేసే అవకాశం ఇచ్చినందుకు దేవాలయ నిర్వాహకులకు, స్థానికులకు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు. ఘటాన్ని చూసి వారందరూ అభినందిస్తుంటే సంతోషంగా ఉంటుంది.