తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
ABN , First Publish Date - 2021-12-06T05:29:13+05:30 IST
భారీ వర్షాలకు జమ్మలమడుగు నియోజకవర్గంలో తడిసి మొలకెత్తిన వరి ధాన్యా న్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
జమ్మలమడుగు రూరల్, డిసెంబరు 5: భారీ వర్షాలకు జమ్మలమడుగు నియోజకవర్గంలో తడిసి మొలకెత్తిన వరి ధాన్యా న్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. మండంలోని ధర్మాపురం, గొరిగెనూరు, దానవులపాడు, సలివెందుల, పెద్దదండ్లూరు, అంబవరం, పొన్నతోట, గూడెం చెరువు తదితర ప్రాంతాల్లో రైతులు వరి సాగు చేశారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పొలాల్లో నీరు నిలిచి వరితోపాటు ఇతర పంటలు నీళ్లలో మునిగి 90 శా తం నష్టపోవడం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇటీవల సంబందిత అధికారులు, ఎమ్మెల్యే సుదీర్రెడ్డి పంటలు దెబ్బతిన్న పొలాలను పరిశీలించి నష్టపోయిన ప్రతి రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొ న్నారన్నారు. అందులో భాగంగా మూడు రోజుల నుంచి వర్షం లేకపోవడంతో రైతులు పొలాల్లో దిగి
వరి కోతలు మొదలు పెట్టారు. కొన్ని చోట్ల మిషన్లతో వరి కోతలు ప్రారంభించారు. ఈ మేరకు ప్రధాన రోడ్లకు ఇరువైపుల రైతులు వరిధాన్యాన్ని ఆరబోసి బస్తాల్లో నింపారు. ఏది ఏమైనా మొలకెత్తిన వరి ధాన్యం తడిచిన వరిధాన్యాన్ని వ్యాపారులు కొనడానికి వచ్చి ముఖం చాటేసి వెళుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకుని అన్ని విధాల ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.