ప్రజాసేవలో పోటీపడాలి
ABN , First Publish Date - 2021-05-08T06:00:02+05:30 IST
ఎన్నికల్లో గెలవడం ముఖ్యం కాదు.. గెలిచిన తర్వాత వార్డు ప్రజల సమస్యలు తెలుసుకొని నిరంతరం ప్రజాసేవలో పోటీపడితే ప్రజలే మిమ్మల్ని గెలిపించుకుంటారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు నూతన పాలకవర్గ కౌన్సిలర్లకు దిశానిర్ధేశం చేశారు.
రాబోయే రోజుల్లో వార్డుల అభ్యున్నతికి కృషి చేయాలి
ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన అభ్యర్థులను ఆదరించాలి
నూతన మున్సిపల్ కౌన్సిలర్లకు దిశానిర్దేశం చేసిన మంత్రి హరీశ్రావు
సిద్దిపేట సిటీ, మే 7: ఎన్నికల్లో గెలవడం ముఖ్యం కాదు.. గెలిచిన తర్వాత వార్డు ప్రజల సమస్యలు తెలుసుకొని నిరంతరం ప్రజాసేవలో పోటీపడితే ప్రజలే మిమ్మల్ని గెలిపించుకుంటారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు నూతన పాలకవర్గ కౌన్సిలర్లకు దిశానిర్ధేశం చేశారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని రెడ్డిఫంక్షన్ హాల్లో నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ కౌన్సిలర్లతో సమావేశాన్ని నిర్వహించారు.
మీ వార్డుకు మీరే తల్లిదండ్రులు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈసారి కొత్తగా ఎన్నికైన 36 మంది కౌన్సిలర్లలో సగం మంది యువకులే ఉన్నారన్నారని చెప్పారు. నేటి నుంచి మీ వార్డు ప్రజలకు మీరు తల్లిదండ్రుల్లాంటి వారని, ప్రజల అవసరాలు తెలుసుకొని అమలు చేయడంలో ముందుండాలన్నారు. యువకులు వార్డు ప్రజలకు అవసరమయ్యే కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టాలన్నారు. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ప్రజలకు సంబంధించిన ప్రతీదానికి బాధ్యులు మీరేనంటూ పునరుద్ఘాటించారు. ప్రజల్లోకి వెళ్లి, వారి అవసరాలు తెలుసుకొని తీర్చడంలోనే నిజమైన నాయకత్వ లక్షణం అనిపించుకుంటుందన్నారు. అలాగే మీ వార్డుల్లో మీ మీద పోటీ చేసిన వారిని కూడా ఆదరిస్తే, వారు కూడా మీకు మిత్రులు అవుతారని, దీంతో వార్డుకు మంచి జరుగుతుందన్నారు. వార్డు ప్రజలతో కలివిడిగా ఉంటూ వారి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించి మీ బాధ్యతను నిర్వర్తించాలన్నారు.
ఎక్కువసార్లు గెలిచినవారిని ఆదర్శంగా తీసుకోవాలి
సిద్దిపేట పట్టణంలో కౌన్సిలర్గా పోటీ చేసి నాలుగు, ఐదు సార్లు గెలిచిన కౌన్సిలర్లను ఆదర్శంగా తీసుకోవాలని నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు మంత్రి హరీశ్రావు సూచించారు. పట్టణంలో కడవేర్గు రాజనర్సు, బర్ల మల్లికార్జున్, గుడాల సంధ్య శ్రీకాంత్ ఎన్నికల్లో నాలుగైదుసార్లు గెలిచారని, వారి సూచనలు తీసుకొని, వార్డు ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడం, సమస్యలు తెలుసుకోవడంలాంటివి నేర్చుకోవాలని చెప్పారు. కౌన్సిలర్లు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేయాలన్నారు. సమస్యలను పట్టించుకుంటే జనంతో మీకు సంబంధాలు మెరుగవుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, టీఎ్సఎ్ఫడీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.