‘మసీదుల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలి’
ABN , First Publish Date - 2020-06-03T10:33:36+05:30 IST
ప్రార్థనా స్థలాలపై ఈ నెల 8 నుంచి లాక్డౌన్ సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో మసీదులు కూడా తెరుచుకోనున్నాయి.
హైదరాబాద్ సిటీ, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): ప్రార్థనా స్థలాలపై ఈ నెల 8 నుంచి లాక్డౌన్ సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో మసీదులు కూడా తెరుచుకోనున్నాయి. ప్రార్థనలు చేసే ముస్లింలు కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలను కోరారు. మసీదులు తెరిచేముందు మసీదు కమిటీలు, మతపెద్దలు ఓ ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. 65 ఏళ్లు దాటిన వారు మసీదులకు వెళ్లకుండా ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఈ నెలాఖరు వరకు మసీదులకు వెళ్లొద్దని సూచించారు.
నమాజు కార్పెట్లపై కాకుండా నేలపై చేయాలన్నారు. కార్పెట్లో సూక్ష్మక్రిములు ఎక్కువగా నిలిచిపోయే ప్రమాదమున్నందున జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మసీదుల్లో నమాజు చేసేందుకొచ్చే వారు ముఖం, కాళ్లు, చేతులను తమ తమ ఇళ్లలోనే శుభ్రం చేసుకుని రావాలని సూచించారు. ఇప్పటికే మసీదులు తెరుచుకున్న గల్ఫ్దేశాల్లో భౌతిక దూరం పాటిస్తున్నారన్నారు. దూరం దూరం నిలబడి నమాజు చేసేలా ప్రకటన జారీ చేయాలని సూచించారు.