నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ గేట్ల మూసివేత

ABN , First Publish Date - 2021-10-31T02:07:20+05:30 IST

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద రాక తగ్గడంతో శనివారం ఐదు గంటలకు క్రస్ట్‌ గేట్లను మూసివేశారు.

నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ గేట్ల మూసివేత

నాగార్జునసాగర్‌: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద రాక తగ్గడంతో శనివారం ఐదు గంటలకు క్రస్ట్‌ గేట్లను మూసివేశారు. రెండు రోజులుగా రెండు క్రస్ట్‌ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు నీటి రాక స్వల్పంగా తగ్గడంతో క్రస్ట్‌గేట్లను మూసివేశారు. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 589.80 అడుగులు(311.4474టీఎంసీలు)గా ఉంది. సాగర్‌ నుంచి కుడి కాల్వ ద్వారా 8529 క్యూసెక్కుల నీటిని, ఎడమ కాల్వ ద్వారా 8807 క్యూసెక్కుల నీటిని, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 32561 క్యూసెక్కుల నీటిని, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని, సాగర్‌ నుంచి మొత్తం 51697 క్యూసెక్కుల నీరు విడుదలచేస్తున్నారు. ఎగువన ఉన్న శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 30431 క్యూసెక్కులు, ఎడమ గట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా 35315 క్యూసెక్కుల వరదను సాగర్‌కు విడుదలచేస్తున్నారు. మొత్తం శ్రీశైలం నుంచి మొత్తం 65746 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వచ్చి చేరుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగుల (215.8070టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 873.60 అడుగులు(153.1332టీఎంసీలు)గా ఉంది. ఎగువ నుంచి శ్రీశైలాని 13137 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

Updated Date - 2021-10-31T02:07:20+05:30 IST