పని చేయని నాగటూరు ఎత్తిపోతల పథకం
ABN , First Publish Date - 2021-05-17T05:46:09+05:30 IST
ఏళ్లు గడుస్తున్నా, కోట్లు ఖర్చు పెడుతున్నా నాగటూరు ఎత్తిపోతల పథకం పనిచేయడం లేదని సీపీఎం జిల్లా నాయకులు ఎం నాగేశ్వరావ్, భాస్కరెడ్డి అన్నారు.
- కోట్లు ఖర్చు అవుతున్నా ఫలితం ఇవ్వని ఫేస్ 2
- సీపీఎం నాయకులు నాగేశ్వరరావు, భాస్కరరెడ్డి
నందికొట్కూరు రూరల్, మే 16 : ఏళ్లు గడుస్తున్నా, కోట్లు ఖర్చు పెడుతున్నా నాగటూరు ఎత్తిపోతల పథకం పనిచేయడం లేదని సీపీఎం జిల్లా నాయకులు ఎం నాగేశ్వరావ్, భాస్కరెడ్డి అన్నారు. ఆదివారం నందికొట్కూరు మండంలోని నాగటూరు ఎత్తిపోతల పథకాన్ని సీపీఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగటూరు ఎత్తి పోతల పథకం ఫేస్ 1 కొంత మేరకు పనిచేస్తున్నా ఫేస్2 ఏ మాత్రం పనిచేయడం లేదన్నారు. దీనికింద నందికొట్కూరు, పగిడ్యాల, పాలమర్రి, మద్దిగట్ల, మండ్లెం, తర్తూరు, వీపనగండ్ల తదితర గ్రామాల పొలాలు ఉన్నాయని అన్నారు. ఫేస్2కు దాదాపుగా రూ. 5.46 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఇందులో దాదాపుగా 4 కోట్లు ఖర్చు పెట్టినట్లు అధికారులు తెలిపారన్నారు. ప్రతి సంవత్సరం పొలాలకు నీరు వస్తుందని రైతులు ఎదురు చూడడం పరిపాటిగా మారిందన్నారు. ఇప్పటికైనా అధికారులు త్వరిత గతిన పనులు పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలన్నారు. నాగటూరు లిఫ్ట్ డీఈ కేశవయ్య మాట్లా డుతూ తాను కొత్తగా వచ్చానని, ఈ లిఫ్ట్ గురించిన వివరాలు పూర్తిగా తెలుసుకుంటున్నానని అన్నారు. ఈ ఖరీఫ్ నాటికి పూర్తి చేసి పొలాలకు నీరందించేందకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పక్కీర్సాహెబ్, రాజు, వెంకటేశ్వర్లు, రైతులు తిక్కస్వామి, శ్రీనివాసులు పాల్గొన్నారు.