హెరిటేజ్ ఫుడ్స్ 50% మధ్యంతర డివిడెండ్
ABN , First Publish Date - 2021-10-22T07:48:32+05:30 IST
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి హెరిటేజ్ ఫుడ్స్ రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.2.5 (50ు) మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది.
త్రైమాసిక లాభం రూ.33 కోట్లు
బోర్డులోకి కొత్త డైరెక్టర్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి హెరిటేజ్ ఫుడ్స్ రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.2.5 (50%) మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. ముత్తురాజు పరవస రాజు విజయ్ కుమార్ను నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా బోర్డు నియమించింది. కాగా సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత ప్రాతిపదికన రూ.32.8 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.53.9 కోట్లుగా ఉంది. కార్యకలాపాల ద్వారా లభించిన ఆదాయం 10 శాతం వృద్ధితో రూ.670.3 కోట్లకు చేరింది. ప్రథమార్ధానికి కంపెనీ ఆదాయం రూ.1,318 కోట్లు, లాభం రూ.63 కోట్లుగా నమోదైంది. సెప్టెంబరుతో ముగిసిన మూడు నెలలకు పాల సేకరణ రోజుకు 12 లక్షల లీటర్ల నుంచి 13 లక్షల లీటర్లకు చేరినట్లు హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మణి నారా తెలిపారు. ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే మొత్తం ఆదాయంలో విలువ చేర్చిన ఉత్పత్తుల ఆదాయం వాటా 21.7 శాతం నుంచి 25.7 శాతానికి పెరిగింది.
రెండో త్రైమాసికంలో కొవిడ్ ప్రతికూల పరిస్థితుల నుంచి కంపెనీ కోలుకుందని బ్రహ్మణి అన్నారు. ఆదాయం పెరగడం.. మరిన్ని విలువ చేర్చిన ఉత్పత్తులను విడుదల చేయడం ఆస్తి, అప్పుల పట్టిక బలోపేతం కావడానికి దోహదం చేశాయన్నారు.