పార్టీ బలోపేతానికి కృషి చేయండి
ABN , First Publish Date - 2020-10-24T11:06:32+05:30 IST
తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసి కట్టుగా పని చేయాలని, ఈ విషయంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తాము అండగా ఉంటామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటాం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
కర్నూలు(అగ్రికల్చర్), అక్టోబరు 23: తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసి కట్టుగా పని చేయాలని, ఈ విషయంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తాము అండగా ఉంటామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అనంతపురం జిల్లాలో వరదల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను ఓదార్చేందుకు వెళుతున్న ఆయన పంచలింగాల చెక్పోస్టు వద్ద పార్టీ జిల్లా నాయకులతో శుక్రవారం కాసేపు మాట్లాడారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు అందరు సమష్టిగా పని చేయాలని సూచించారు. కర్నూలు లోక్సభ నియోజకవర్గం అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నంద్యాల లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షులు ముంతాజ్, పార్వతమ్మ తదితరులు లోకేష్ని కలిశారు. జిల్లాలో రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు.
ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ ప్రజల్లో తెలుగుదేశం పార్టీపై అభిమానం పెరుగుతోందని, కేవలం ఏడాదిన్నర పాలనలోనే వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రజా వ్యతిరేక పాలనపై వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టాలని సూచించారు. వైసీపీ నాయకులకు భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని నాయకులు, కార్యకర్తలకు లోకేష్ హామీ ఇచ్చారు. పార్టీ నాయకులు నంద్యాల నాగేంద్రకుమార్, హనుమంతరావు చౌదరి, అబ్బాస్, సత్రం రామక్రిష్ణుడు, జేమ్స్ తదితరులు లోకేష్ని కలుసుకున్నారు. అనంతపురం పర్యటన ముగించుకున్న తరువాత రాత్రి కర్నూలు మీదుగా లోకేష్ తిరిగి హైదరాబాదుకు చేరుకున్నారు. పంచలింగాల వద్ద పార్టీ జిల్లా నాయకులు ఆయనకు వీడ్కోలు పలికారు.