టీచర్స్ డే శుభాకాంక్షలు: నారా లోకేష్
ABN , First Publish Date - 2021-09-05T17:13:02+05:30 IST
జీవితంలో ఎదగడానికే కాదు, మన వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడంలో కూడా ఉపాధ్యాయుల ప్రభావం...
అమరావతి: జీవితంలో ఎదగడానికే కాదు, మన వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడంలో కూడా ఉపాధ్యాయుల ప్రభావం చాలా ఉంటుందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన దివంగత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని దేశసేవను స్మరించుకుంటూ, గురువులకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు.
కరోనా కారణంగా ఏపీలో చాలా మంది ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు ఉపాధి కోల్పోయారని లోకేష్ అన్నారు. కొందరు కూలీ పనులకు కూడా వెళ్తున్నారని, ప్రభుత్వం వారికి ఏ సాయమూ చేయలేదని విమర్శించారు. ఇంకోవైపు చూస్తే మొదటి ఏడాదే మెగా డీఎస్సీ అన్న సీఎం జగన్ ఇంతవరకు ఆ మాటే ఎత్తడం లేదని ఆరోపించారు. ఉపాధ్యాయులను గౌరవించి, పూజించే సంస్కారం ఈ ప్రభుత్వానికి ఎలాగూ లేదని, కనీసం వారికి ఆకలి బాధలు లేకుండా చేస్తే అదే పదివేలన్నారు. కరోనాతో మృతి చెందిన ఉపాధ్యాయ కుటుంబాలకు పరిహారం ఏమిస్తారో కనీసం ఈ రోజైనా ప్రకటించాలని లోకేష్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.