జగన్‌కు బీసీల పేరెత్తే అర్హతే లేదు: నారా లోకేశ్

ABN , First Publish Date - 2021-11-24T00:32:17+05:30 IST

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. సొంత కులానికి ముఖ్యమైన 1600 ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టుకుని..

జగన్‌కు బీసీల పేరెత్తే అర్హతే లేదు: నారా లోకేశ్

అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. సొంత కులానికి ముఖ్యమైన 1600 ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టుకుని సీఎం జగన్ వెన‌క‌బ‌డిన త‌ర‌గ‌తుల‌కు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. సీఎం జగన్‌కు బీసీల గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. సామాజిక‌ న్యాయం గురించి జగన్ మాట్లాడొద్దని, సిగ్గుతో ఆ ప‌దం ఆత్మ‌హ‌త్య చేసుకుంటుందని ఎద్దేవా చేశారు.  ‘‘నీ కులం కుతంత్రం, నీ మ‌తం మార‌ణ‌హోమం, నీ ల‌క్ష్యం విధ్వంసం’’ అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీలో బీసీలకు సంబంధించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ లోకేశ్ ట్వీట్ చేశారు. 


‘‘వ్యవస్థల విధ్వంసానికి జగన్ బ్రాండ్ అంబాసిడర్. పల్లె పోరు‌లో ఫ్యాన్‌కి ఓటేస్తే గ్రామాల రూపురేఖలు మారుస్తానన్న జగన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా పంచాయతీ ఖాతాల్లో ఉన్న సొమ్ముని కాజేస్తున్నారు. రాజ్యాంగ విరుద్ధంగా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. 14వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి విద్యుత్ బకాయిలంటూ రూ.345 కోట్లు కట్ చేశారు. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం కేటాయించిన రూ.965 కోట్లను ప్రభుత్వం పక్కదారి పట్టించడం గ్రామీణ ప్రజలకు తీరని అన్యాయం చెయ్యడమే. 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులతో గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని సర్పంచులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న తరువాత ఖాతాల్లో సొమ్ము జీరో అయితే సర్పంచ్‌లు ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలి? తక్షణమే ప్రభుత్వం మళ్లించిన సొమ్ముని పంచాయతీల ఖాతాల్లో వెయ్యాలి.’’ అని లోకేశ్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-11-24T00:32:17+05:30 IST